‘కాలుష్య’ నియంత్రణ ఎలా?
ABN , Publish Date - Jun 30 , 2026 | 04:55 AM
రాష్ట్రంలో కాలుష్యాన్ని నియంత్రించాల్సిన సంస్థలోనే ‘కాలుష్యం’ పెరిగిపోతోంది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లో సిబ్బంది...
నిర్లక్ష్యం, సిబ్బంది కొరత, కొందరు అధికారులు కంపెనీలతో కుమ్మక్కు..!
ఫిర్యాదులు చేసినా పట్టించుకోని వైనం
నమూనాల్లేకుండానే నివేదికలు
హైదరాబాద్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాలుష్యాన్ని నియంత్రించాల్సిన సంస్థలోనే ‘కాలుష్యం’ పెరిగిపోతోంది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లో సిబ్బంది కొరత, క్షేత్రస్థాయిలో తీవ్ర నిర్లక్ష్యం, కొందరు అధికారులు కంపెనీల యాజమాన్యాలతో కుమ్మక్కవడం వంటి కారణాలతో ప్రజల ప్రాణాలు గాల్లో దీపంలా మారుతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న పరిశ్రమలు, ముఖ్యంగా బల్క్ డ్రగ్, ఫార్మా కంపెనీలు కాలుష్యాన్ని వెదజల్లుతున్న నేపథ్యంలో పీసీబీ బలహీనంగా మారడం ఆందోళన కలిగిస్తోంది. నిబంధనల ప్రకారం అధిక కాలుష్యాన్ని విడుదల చేసే బల్క్ డ్రగ్, ఫార్మా కంపెనీల పరిసర ప్రాంతాల్లో మట్టి, నీరు, గాలి నమూనాలను సేకరించి కనీసం ఏడాదికి ఒకసారైనా విశ్లేషణ చేయాలి. కానీ, కొందరు అధికారులు ఎలాంటి నమూనాలు సేకరించకుండానే నివేదికలు రూపొందిస్తుండగా.. మరికొందరేమో కంపెనీల యాజమాన్యాలతో కుమ్మక్కై తప్పుడు నివేదికలు ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా ఫార్మా కంపెనీల పరిసర గ్రామాల్లో కాలుష్యం పెరిగిపోతోంది. ఆయా గ్రామాల్లోని బోరు బావుల నీరు పూర్తిగా రంగు మారి, దుర్వాసన వస్తోంది. ఆ నీరు తాగడానికే కాదు, సాగుకీ పనికిరాని పరిస్థితి నెలకొంది.
ఫిర్యాదులు పట్టించుకోని అధికారులు
కాలుష్య సమస్యపై స్థానిక రైతులు, యువకులు పలుమార్లు రాతపూర్వక ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ అధికారులు వాటిని పట్టించుకోవడం లేదు. పైగా తమ రిపోర్టుల్లో మాత్రం ఫిర్యాదుదారులకు సమాచారం ఇచ్చి, తనిఖీలు నిర్వహించినట్లు చూపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదు దారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీసీబీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పరిశ్రమలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. కాలుష్యం రోజురోజుకూ పెరుగుతోంది. దానికి తోడు తమకు వ్యతిరేకంగా, అడ్డుగా ఉన్న అధికారులను ఫార్మా కంపెనీల యాజమాన్యాలు అక్కడి నుంచి బదిలీ చేసేలా పైరవీలు కూడా చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. నల్లగొండలో పేరుమోసిన ఓ సంస్థ యాజమాన్యం గతంలో ఓ అధికారిని అలాగే బదిలీ చేయించిందని స్థానికులు చెబుతున్నారు. వాస్తవానికి పీసీబీలో సిబ్బంది కొరత వల్ల క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ పూర్తిగా దెబ్బతింది. ఒకే అధికారి అనేక జిల్లాల బాధ్యతలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పరిశ్రమలపై సమగ్ర తనిఖీలు జరగడం లేదు. ఇదే అదనుగా భావించిన కొందరు అధికారులు పరిశ్రమలకు విధేయులుగా మారారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏమైనా ఫిర్యాదులు వచ్చినా, ఆర్టీఐ అర్జీలు వచ్చినా వెంటనే కంపెనీ యాజమాన్యాలకు చేరవేస్తున్నారని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు. అంతేగాక ఆర్టీఐ కింద సమాచారాన్ని ఇవ్వాలని కోరితే.. ‘మీ సమస్యలేంటి, మీకేం కావాలి?’ అంటూ కొందరు అధికారులే మధ్యవర్తిత్వానికి ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వినిపిన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పీసీబీలో సమూల మార్పులు అవసరమని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. ఇక, పీసీబీ కార్యాలయాల పరిస్థితి కూడా దయనీయంగానే ఉంది.