ఆయిల్ పామ్ ధర రూ.1459 మేర పెంపు
ABN , Publish Date - Apr 02 , 2026 | 03:05 AM
రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం కలిగించే దిశగా మరో సానుకూల పరిణామం చోటుచేసుకుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
ఆయిల్ పామ్ సాగు పెరిగే అవకాశం: మంత్రి తుమ్మల
హైదరాబాద్, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం కలిగించే దిశగా మరో సానుకూల పరిణామం చోటుచేసుకుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటివరకు టన్నుకు రూ.21,546గా ఉన్న గెలల ధర.. రూ.1,459 మేర పెరిగి ప్రస్తుతం రూ.23,005కు చేరిందని బుధవారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ధరలు పెరగడం.. రైతుల్లో నమ్మకాన్ని పెంచుతుందని, భవిష్యత్తులో మరింత మంది రైతులు ఆయిల్ పామ్ సాగు వైపు మళ్లే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాగా, కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఫార్మర్ రిజిస్ర్టీ నమోదులో దేశంలోనే తెలంగాణ ముందుందని, మూడు నెలల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. రైతుల సమగ్ర డేటా ద్వారా ప్రభుత్వ పథకాల అమలు మరింత పారదర్శకంగా జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఖరీఫ్ సీజన్ను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర కోటా మేరకు యూరియా సరఫరా చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.