ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
ABN , Publish Date - May 01 , 2026 | 05:48 AM
కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలుగా సహకారం అందిస్తున్నప్పటికీ ధాన్యం కొనుగోలులో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు విమర్శించారు.
రైతులు అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు
భువనగిరి రూరల్, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలుగా సహకారం అందిస్తున్నప్పటికీ ధాన్యం కొనుగోలులో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు విమర్శించారు. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం హన్మాపురంలో గురువారం ఆయన రైతుమోర్చా నాయకులతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. 15 రోజులుగా ధాన్యం రాశులతో పడిగాపులు కాస్తున్నామని, పొద్దున ఆరబెట్టడం, రాత్రి కుప్ప చేయడం పనిగా మారిందని, ధాన్యం రవాణాకు 10రోజులుగా లారీలు రావడం లేదని రైతులు పేర్కొనగా.. రాంచందర్రావు వెంటనే అదనపు కలెక్టర్ వెంకారెడ్డితో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కరించాలని కోరారు. అనంతరం రాంచందర్రావు విలేకరులతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కారణంగానే నల్లగొండ జిల్లా కనగల్ మండలం బచ్చన్నగూడెంలో కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు ఆత్మహత్యాయత్నం చేశారన్నారు. రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అక్రమాలకు పాల్పడుతున్న మిల్లర్లు, దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు