విదేశాల్లో ఉన్నత విద్యకు బీసీ, ఈబీసీ విద్యార్థులకు సువర్ణావకాశం
ABN , Publish Date - Aug 29 , 2026 | 04:48 AM
మహాత్మా జ్యోతిబాఫూలే ఓవర్సీస్ విద్యానిథి పథకం ద్వారా విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పిస్తోంది.
1వ తేదీ నుంచి దరఖాస్తులకు ఆహ్వానం
హైదరాబాద్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): మహాత్మా జ్యోతిబాఫూలే ఓవర్సీస్ విద్యానిథి పథకం ద్వారా విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పిస్తోంది. 2026 ఆగస్టు/సెప్టెంబర్ ఫాల్సెషన్ కోసం దరఖాస్తుల స్వీకరణ సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు కొనసాగనుందని వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ కమిషనర్ బాలమయాదేవి పేర్కొన్నారు. ఈ విడతలో మొత్తం 350 మంది విద్యార్థులను ఎంపిక చేయనుండగా, అందులో 250 మంది బీసీ, 100 మంది ఈబీసీ విద్యార్థులు ఉంటారు. విదేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెడీ వంటి ఉన్నత విద్యా కోర్సులను అభ్యసిస్తున్న లేదా అభ్యసించాలనుకుంటున్న అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీసీ సంక్షేమశాఖ సూచించింది. అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం అన్ని వనరుల నుంచి రూ. 5 లక్షల లోపు ఉండాలి. దరఖాస్తు చేసే నాటికి వయసు 35 ఏళ్లకు మించకూడదు. గ్రాడ్యుయేషన్లో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. జీఆర్ఈ 260 లేదా జీమ్యాట్ 500 స్కోర్ కలిగి ఉండాలి. టోఫెల్ 60 మార్కులు లేదా ఐఈఎల్టీఎస్ 6.0 లేదా పీటీఈ 50 మార్కులు స్కోర్ ఏదైనా కలిగి ఉండాలి. మరిన్ని వివరాలు, దరఖాస్తు ప్రక్రియ కోసం ‘తెలంగాణ ఈ-పాస్ వెబ్సైట్’ను సందర్శించాలని సూచించింది.