ఉత్తర డిస్కమ్లో సమగ్ర డిజిటల్ డ్యాష్బోర్డు వ్యవస్థ
ABN , Publish Date - Jun 28 , 2026 | 03:12 AM
అన్ని విభాగాల పనితీరును నిరంతరం పర్యవేక్షించేందుకు, సమాచార ఆధారిత నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా విభాగాల వారిగా ‘డిజిటల్ డ్యాష్బోర్డ్’ను ....
విభాగాల పనితీరుపై రియల్ టైమ్ పర్యవేక్షణ
హైదరాబాద్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): అన్ని విభాగాల పనితీరును నిరంతరం పర్యవేక్షించేందుకు, సమాచార ఆధారిత నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా విభాగాల వారిగా ‘డిజిటల్ డ్యాష్బోర్డ్’ను తెలంగాణ ఉత్తర డిస్కమ్(టీజీఎన్పీడీసీఎల్) అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ అత్యాధునిక కమాండ్ ఇంటర్ఫేస్ ద్వారా సంస్థ పరిధిలోని అన్ని సర్కిళ్లు, డివిజన్లు, సెక్షన్ల రోజువారీ కార్యకలాపాలు రియల్ టైమ్లో సీనియర్ అధికారులు అందరికి అందుబాటులో ఉంటాయి. ఈ డ్యాష్బోర్డ్ ద్వారా సంస్థలోని ఆపరేషన్లు, ఫైనాన్స్, హెచ్ఆర్, ప్రాజెక్టులు, ఎంఆర్టీ, పర్చేజ్ అండ్ మెటీరియల్స్ మేనేజ్మెంట్, వినియోగదారుల సేవా కేంద్రం తదితర విభాగాల పనితీరును ఒకే వేదికపై రియల్ టైమ్లో పర్యవేక్షించే అవకాశం కలుగుతుందని ఉత్తర డిస్కమ్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి తెలిపారు. సంస్థకు అవసరమైన విద్యుత్ పరికరాలు, మెటీరియల్ నిల్వలు, వినియోగ సరళిని ఈ డ్యాష్బోర్డ్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. మెటీరియల్ కొరత ఏర్పడకుండా 1 నుంచి 3 నెలల ముందే అప్రమత్తం చేసే వ్యవస్థ ఇందులో ఉంటుంది. ఉద్యోగులు/ఆర్టిజన్ల వివరాలు, వారి జీతభత్యాల ఖర్చు, పదవీ విరమణ షెడ్యూళ్లు, మెడి క్లెయిమ్లు, కోర్టు కేసుల పురోగతిని ఈ సింగిల్ విండో ఇంటర్ఫేస్ ద్వారా పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. వినియోగదారుల సేవా కేంద్రం వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు 1912 కాల్ సెంటర్ పనితీరును, సర్కిళ్ల వారీగా పెండింగ్ ఉన్న ఫిర్యాదులను విశ్లేషించేందుకు ఉపయోగపడుతుంది. ట్రాన్స్ఫార్మర్ల వైఫల్యాలు, వాటికి గల కారణాలు, పదే పదే ఫెయిల్ అవుతున్న ప్రాంతాలను గుర్తించి విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూసేందుకు, విద్యుత్ దొంగతనాలను అరికట్టేందుకు తోడ్పడుతుంది. ఎంఆర్టీ విభాగంలో పవర్ ట్రాన్స్ఫార్మర్లు, రక్షణ పరికరాల తనిఖీలు, ఫిర్యాదుల స్థితి, లక్ష్య సాధన వివరాలను పర్యవేక్షించవచ్చని సీఎండీ తెలిపారు.