ఇద్దరు పిల్లలను చంపి..ఉరేసుకొని తల్లి ఆత్మహత్య
ABN , Publish Date - Mar 29 , 2026 | 07:16 AM
భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహిళ.. తన ఇద్దరు పిల్లలను గొంతు నులిమి చంపి, ఆపై ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది.
2 నెలల క్రితం భర్త చనిపోవడంతో మనస్తాపం
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో దారుణం
కంది/వర్ధన్నపేట రూరల్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహిళ.. తన ఇద్దరు పిల్లలను గొంతు నులిమి చంపి, ఆపై ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని జుల్కల్లో శనివారం జరిగింది. కంది మండలం మక్తాఅల్లూరుకు చెందిన మమతకు (35) జుల్కల్కు చెందిన ప్రవీణ్తో వివాహం జరిగింది. వీరికి కుమారుడు మణికంఠ (5), కూతురు ప్రణయశ్రీ (3) ఉన్నారు. రెండు నెలల కింద ప్రవీణ్ ఓ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. అయితే అది తట్టుకోలేక మమత తీవ్ర మనోవేదనకు గురైంది. ఈ నేపథ్యంలోనే శనివారం ఉదయం మమత తన ఇద్దరు పిల్లలను గొంతు నులిమి చంపి.. సీలింగ్ ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి బీర్ల శంకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
మూడేళ్ల కొడుకుతో కాలువలో దూకిన తల్లి..
వరకట్న వేధింపులు భరించలేక ఓ కానిస్టేబుల్ భార్య మూడేళ్ల కుమారుడితో కలిసి ఎస్సారెస్పీ కాలువలో దూకింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్ర్యాలకు చెందిన కామిండ్ల కల్యాణి(30)కి నాలుగేళ్ల క్రితం స్టేషన్ ఘన్పూర్కు చెందిన కానిస్టేబుల్ హరీశ్తో వివాహమైంది. వీరికి మూడేళ్ల కొడుకు శ్రేయాన్ష్ ఉన్నాడు. వరంగల్ రంగశాయిపేటలో ఉంటున్న ఈ దంప తుల మధ్య రెండేళ్లుగా వరకట్నం విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో మనస్తాపం చెందిన కల్యాణి శనివారం తల్లిగారి ఊరైన కట్ర్యాలకు వచ్చి ఎస్సారెస్పీ కాలువలో కొడుకుతో కలిసి దూకింది. కాలువ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో తల్లీకుమారుల ఆచూకీ లభ్యం కాలేదు.
