సబ్కా సాథ్.. సబ్కా వికాస్..వట్టి నీటి మూటలే
ABN , Publish Date - Feb 02 , 2026 | 03:01 AM
తెలంగాణ అభివృద్ధిపై ‘సబ్కా సాథ్-సబ్కా వికాస్’ అనే కేంద్ర ప్రభుత్వ నినాదం వట్టి నీటి మూటలేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ధ్వజమెత్తారు.
కేంద్ర బడ్జెట్పై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అభివృద్ధిపై ‘సబ్కా సాథ్-సబ్కా వికాస్’ అనే కేంద్ర ప్రభుత్వ నినాదం వట్టి నీటి మూటలేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ధ్వజమెత్తారు. అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం ఉంటుందని చెబుతూనే.. నిధుల కేటాయింపుల్లో తెలంగాణపై రాజకీయ వివక్ష చూపడం నైతికత అనిపించుకోదని చెప్పారు. దేశ జీడీపీలో 5శాతానికి పైచిలుకు వాటా గల తెలంగాణ పేరును ఒక్కసారైనా ప్రస్తావించకపోవడం గర్హనీయమని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఆర్థిక హేతుబద్ధత ఆధారంగా రూపొందించాల్సిన బడ్జెట్లో కేంద్రం తన రాజకీయ అనుకూలతకు ప్రాధాన్యం ఇచ్చి.. తెలంగాణ వంటి ప్రగతి శీల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసింది’ అని ఆరోపించారు. హైస్పీడ్ రైల్ కారిడార్లతో తెలంగాణకు మమ అనిపించిన కేంద్ర వివక్షపూరిత వైఖరిపై 8 మంది తెలంగాణ బీజేపీ ఎంపీలు జవాబు చెప్పాలని మంత్రి దుద్దిళ్ల డిమాండ్ చేశారు.