అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చాం
ABN , Publish Date - Jun 25 , 2026 | 04:57 AM
ప్రజలతో ముఖాముఖి’ కార్యక్రమంలో రేషన్ కార్డుల కోసం ఒక్క దరఖాస్తూ రాలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. తమ ప్రభుత్వం అర్హత....
అందుకే ప్రజలతో ముఖాముఖిలో దరఖాస్తులు రావట్లేదు
2 లక్షల కొత్తపెన్షన్లకు త్వరలో లబ్ధిదారుల ఎంపిక: పొన్నం
హైదరాబాద్, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): ‘ప్రజలతో ముఖాముఖి’ కార్యక్రమంలో రేషన్ కార్డుల కోసం ఒక్క దరఖాస్తూ రాలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. తమ ప్రభుత్వం అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు ఇచ్చిందని, అందువల్లే రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు రావట్లేదని పేర్కొన్నారు. కొత్త పెన్షన్లు, భూ సమస్యలపైనే దరఖాస్తులు వస్తున్నాయని చెప్పారు. గాంధీభవన్లో బుధవారం నిర్వహించిన ‘ప్రజలతో ముఖాముఖి’లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని, ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం కొత్తగా 2 లక్షల పెన్షన్లను మంజూరు చేసిందని, వీటికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక త్వరలోనే జరుగుతుందని వెల్లడించారు. హైదరాబాద్లో కొత్తగా లక్ష ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు ఎలాంటి సమస్యులున్నా పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణ కోటా మేరకు ఎరువులు, ముఖ్యంగా యూరియాను సరఫరా చేసే బాధ్యత కేంద్రానిదేనని, రాష్ట్రంలోని బీజేపీ నాయకత్వం ఆ దిశగా ఒత్తిడి తెస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కోటా మేరకు ఎరువులు సరఫరా చేయకుంటే బీజేపీ నేతల ఇళ్ల ఎదుట ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.