Share News

మూతపడిన మెడికల్‌ దుకాణాలు!

ABN , Publish Date - May 21 , 2026 | 03:32 AM

రాష్ట్రంలో కెమిస్ట్స్‌, డ్రగ్గిస్ట్స్‌ అసోసియేషన్‌ చేపట్టిన మందుల దుకాణాల బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. ఆన్‌లైన్‌ (ఈ-ఫార్మసీ)లో మందుల విక్రయాలను నిరసిస్తూ ...

మూతపడిన మెడికల్‌ దుకాణాలు!

  • ప్రశాంతంగా ముగిసిన బంద్‌.. పలుచోట్ల ఇబ్బందులు

  • ఆస్పత్రుల్లో యథావిధిగా పనిచేసిన ఫార్మసీలు

హైదరాబాద్‌, మే 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కెమిస్ట్స్‌, డ్రగ్గిస్ట్స్‌ అసోసియేషన్‌ చేపట్టిన మందుల దుకాణాల బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. ఆన్‌లైన్‌ (ఈ-ఫార్మసీ)లో మందుల విక్రయాలను నిరసిస్తూ చేపట్టిన ఈ బంద్‌లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, పట్టణాల పరిధిలోని మెడికల్‌ షాపుల నిర్వాహకులు పాల్గొన్నారు. ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలను నిషేధించాలంటూ నిరసనలు తెలిపారు. దీనితో పలుచోట్ల రోగులు ఇబ్బందిపడాల్సి వచ్చింది. హైదరాబాద్‌తోపాటు వివిధ పట్టణ ప్రాంతాల్లోని అపోలో, మెడ్‌ప్లస్‌ తదితర కార్పొరేట్‌ మందుల షాపులను తెరిచినా నిరసనకారులు వాటిని మూసివేసి బంద్‌కు సహకరించాలని కోరారు. అయితే ప్రభుత్వ, కార్పొరేట్‌, ప్రైవేట్‌ ఆస్పత్రులు, వాటి ప్రాంగణంలో నిర్వహించే మెడికల్‌ షాపులు యథావిధిగా పనిచేశాయి. హైదరాబాద్‌లోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రులైన గాంధీ, ఉస్మానియా, నిలోఫర్‌, నిమ్స్‌లలో మెడికల్‌ దుకాణాలు తెరిచి ఉంచటంతో.. వాటివద్ద సాధారణ రోజుల్లో కంటే రద్దీ ఎక్కువగా కనిపించింది. ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలపై కెమిస్ట్స్‌, డ్రగ్గిస్ట్స్‌ అసోసియేషన్‌ చేపట్టిన నిరసనకు ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు మద్దతు పలికాయి.

Updated Date - May 21 , 2026 | 03:32 AM