లోక్ అదాలత్లో రూ. 45.21కోట్ల రీఫండ్
ABN , Publish Date - Jun 22 , 2026 | 05:11 AM
సైబర్ నేరగాళ్ల బారినపడి డబ్బు పొగొట్టుకుంటున్న బాధితులకు.. రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన లోక్ అదాలత్లో ఊరట లభించింది.
సైబర్ బాధితులకు భారీ ఊరట
ఒకేరోజు 6,303 మంది బాధితుల అకౌంట్లలోకి సొమ్ము
హైదరాబాద్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): సైబర్ నేరగాళ్ల బారినపడి డబ్బు పొగొట్టుకుంటున్న బాధితులకు.. రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన లోక్ అదాలత్లో ఊరట లభించింది. మొత్తం 6,303 మందికి బాధితులకు రూ.45.21 కోట్ల నగదును రీఫండ్ చేయించినట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. తెలంగాణ న్యాయ సేవా అధికార సంస్ధ, బ్యాంకులు, డిజిటల్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, అన్ని జిల్లాల పోలీసుల సమన్వయంతో ఈ భారీ రికవరీ సాధ్యమైందని వివరించారు. ఇందులో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అత్యధికంగా 2,232 మంది బాధితులకు రూ.21.91 కోట్లు తిరిగి లభించగా, మల్కాజిగిరి పరిధిలో 779మందికి రూ. 4.04కోట్లు, హైదరాబాద్లో 755మందికి రూ. 3.22 కోట్లు, సంగారెడ్డిలో 167 మంది బాధితులకు రూ. 1.69కోట్ల చొప్పున రికవరీ అయ్యాయి. అలాగే, సైబర్ సెక్యూరిటీ బ్యూరో పరిధిలో 77మంది బాధితులకు రూ. 6.83 కోట్ల రీఫండ్ జరిగిందని ఆమె పేర్కొన్నారు. యూపీఐ మోసాలు, ఇన్వె్స్టమెంట్ స్కామ్లు వంటి డిజిటల్ మోసాల్లో బాధితులకు న్యాయం చేసేందుకు పోలీసు, న్యాయవ్యవస్ధ, బ్యాంకుల మధ్య సైబర్ సెక్యూరిటీ బ్యూరో కీలక వారధిగా పని చేస్తోందని శిఖా గోయల్ స్పష్టం చేశారు. బ్యూరో ఏర్పాటైన రెండున్నరేళ్ల కాలంలో రూ. 445.41 కోట్లు రీఫండ్ చేయించగలిగామని పేర్కొన్నారు. సైబర్ మోసానికి గురైతే.. డబ్బు పోయిన గంటల వ్యవధి( గోల్డెన్ అవర్)లో.. 1930 నంబరుకు ఫిర్యాదు చేయగలిగితే డబ్బు వెనక్కి రప్పించే అవకాశం ఉంటుందని సూచించారు.