ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికపైరేపటి నుంచి గ్రామ సభలు
ABN , Publish Date - Apr 01 , 2026 | 05:18 AM
‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఏప్రిల్ 2వ తేదీ నుంచి గ్రామసభలు నిర్వహించాలని జిల్లాల కలెక్టర్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు.
కలెక్టర్లకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలు
హైదరాబాద్, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): ‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఏప్రిల్ 2వ తేదీ నుంచి గ్రామసభలు నిర్వహించాలని జిల్లాల కలెక్టర్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. ప్రజా భవన్ నుంచి మంగళవారం సాయంత్రం ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఒకే తరహాలో గ్రామసభలు నిర్వహించాలన్నారు. తొలుత సీఎం సందేశం.. అటుపై రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు.. రైతు భరోసా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలను వినిపించాలని తెలిపారు. ఇప్పటికే తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతోపాటు జూన్ 2 నుంచి అమలు కానున్న ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని వివరించాలని, ఇందుకోసం పౌర సంబంధాలు, సాంస్కృతికశాఖల సహకారం తీసుకోవాలని మల్లు భట్టి విక్రమార్క సూచించారు. సీఎస్ కె.రామకృష్ణారావు మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై గ్రామ సభల్లో ప్రజల ఫీడ్ బ్యాక్ను సేకరించాలని కలెక్టర్లకు సూచించారు.