Share News

నగదు రహిత వైద్యం

ABN , Publish Date - Feb 24 , 2026 | 05:24 AM

ఉద్యోగుల ఆరోగ్య పథకంలో భాగంగా వారికి నగదురహిత వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

నగదు రహిత వైద్యం

  • రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు త్వరలో అందుబాటులోకి..

  • ఈహెచ్‌ఎ్‌సకు సర్కారు పచ్చజెండా.. కుటుంబసభ్యుల వివరాలతో

  • ప్రతి ఉద్యోగికి, పింఛనుదారుకు హెల్త్‌ కార్డు

  • 826 కార్పొరేట్‌, ప్రైవేటు ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం

  • 1998కి పెరగనున్న ప్రొసీజర్స్‌.. 24.21లక్షల మందికి సేవలు

  • దశలవారీగా ఈహెచ్‌ఎ్‌స పరిధిలోకి సింగరేణి, ఆర్టీసీ, ట్రాన్స్‌కో, జెన్‌కో ఉద్యోగులు.. కార్పొరేట్‌, ఎం ప్యానెల్‌ ఆస్పత్రులతో చర్చలు

  • ఉద్యోగుల నుంచి రూ.528 కోట్లు.. సర్కారు నుంచి అంతే జమ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల ఆరోగ్య పథకంలో భాగంగా వారికి నగదురహిత వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈమేరకు సోమవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో.. ఎంప్లాయీస్‌ క్యాష్‌లెస్‌ హెల్త్‌ స్కీమ్‌కు ఆమోదముద్ర వేసింది. రాబోయే శాసనసభ సమావేశాల్లో ఈహెచ్‌ఎ్‌సకు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈహెచ్‌ఎ్‌సలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 826 ప్రైవేటు ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్య సేవలందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే 7.14 లక్షల సర్కారీ ఉద్యోగులు, పింఛనర్ల వైద్యసేవలకు సంబంధించి ప్రత్యేక గుర్తింపు కార్డు ఇవ్వనున్నారు. పెన్షనర్లు, డిపెండెంట్స్‌తో కలిపి మొత్తం 24.21 లక్షల మందికి ఈ సేవలు అందనున్నాయి. అలాగే వైద్యసేవల ప్రొసీజర్ల సంఖ్యను కూడా పెంచనున్నారు. వైద్యసేవలందించే విషయంలో కార్పొరేట్‌, ఇతర ఎంప్యానెల్‌ ఆస్పత్రులతో సోమవారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సచివాలయంలో సమావేశం అయ్యారు. ప్రభుత్వం త్వరలో తీసుకురానున్న నూతన ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీమ్‌ అమలుపై చర్చించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ సర్కారు ప్రత్యేకంగా డిజిటల్‌ హెల్త్‌ ఎంప్లాయిస్‌ హెల్త్‌ కార్డు ఇవ్వనుంది. ఆ కార్డులో ఒక యూనిక్‌ నంబరు ఉంటుందని వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి. ఉద్యోగి హెల్త్‌ ఐడీ కార్డులో వారి కుటుంబ సభ్యుల వివరాలను కూడా నమోదు చేస్తారు.


సర్కారీ గణాంకాల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో 7.14 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్స్‌ ఉన్నారు. ఈ ఐడీ కార్డుల వివరాలను ప్రభుత్వం 826 ప్రైవేటు నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు అందిస్తుంది. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి/పెన్షనర్‌ ఆరోగ్యపరమైన అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆ కార్డును తీసుకుని ఎంప్యానెల్‌ ఆస్పత్రులకు వెళితే వారు సదరు ఉద్యోగి ఐడీని తమ దగ్గర నమోదు చేస్తారు. దాంతో వారి పూర్తి వివరాలు వెంటనే తెలుస్తాయి. తక్షణమే చికిత్సను ప్రారంభిస్తారు. ఆ 826 ప్రైవేటు ఆస్పత్రుల్లో 652 దవాఖానాలు.. వైద్యవిద్య సంచాలకుల ఎంప్యానెల్‌ జాబితాలో ఉండగా, 174 హస్పిటల్స్‌ ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్డ్‌ ఆస్పత్రుల జాబితాలో ఉన్నాయి. ఇప్పటి దాకా ఉన్న విధానం ప్రకారం ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవాలంటే డీఎంఈ గుర్తించిన అనుసంధాన ఆస్పత్రుల్లోనే ట్రీట్మెంట్‌ తీసుకోవాల్సివచ్చేది. అలాగే ముందుగా వైద్యానికయ్యే ఖర్చులన్నీ ఉద్యోగే భరించాలి. అనంతరం రీయింబర్స్‌మెంట్‌ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి. ఆ రీయింబర్స్‌మెంట్‌ డబ్బులు సంవత్సరాలైనా వచ్చేవి కావు. ఇప్పుడు.. డీఎంఈ గుర్తించిన అనుసంధాన ఆస్పత్రులతో పాటు ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్డ్‌ ఆస్పత్రుల్లో సైతం ఉద్యోగులు నగదురహిత వైద్య సేవలు పొందే అవకాశం కల్పించారు.

మూల వేతనం నుంచి..

ప్రస్తుతం ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీమ్‌ కింద ఆస్పత్రుల్లో 1885 ప్రొసీజర్స్‌ అందుబాటులో ఉన్నాయి. డీఎంఈ పరిఽధిలోని ఆస్పత్రుల్లో మాత్రం 1998 రకాల ప్రొసీజర్స్‌ ఉన్నాయి. కొత్తగా తీసుకురాబోయే ఈహెచ్‌ఎ్‌సలో.. డీఎంఈ పరిధిలో అందిస్తున్న 1998 రకాల ప్రొసీజర్స్‌నూ అందుబాటులోకి తీసుకురానున్నారు. అలాగే ప్రతి నెలా ఉద్యోగుల మూలవేతనం నుంచి 1.5 శాతం మొత్తాన్ని కట్‌ చేస్తారు. అలాగే పెన్షనర్స్‌ నుంచి కూడా. ప్రభుత్వం నుంచి అంతే మొత్తం ట్రస్ట్‌ కేర్‌కు జమ అవుతుందని ఉన్నతాఽధికారులు వెల్లడించారు. ఉద్యోగులు, ప్రభుత్వం నుంచి వచ్చే మొత్తం ఏటా రూ.1056 కోట్లు అవుతుంది. కాగా ఈహెచ్‌ఎ్‌స ట్రస్ట్‌ కేర్‌ చైర్మన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తారు. అలాగే ఉద్యోగుల నుంచి ఆరుగురు, పెన్షనర్స్‌ నుంచి ఇద్దరు ట్రస్ట్‌లో సభ్యులుగా ఉంటారని వైద్యవర్గాలు పేర్కొన్నాయి. అలాగే ట్రస్టు నుంచి ఒకరు సభ్యుడిగా వ్యవహరిస్తారు.

భవిష్యత్‌లో వారు కూడా...

ప్రస్తుతం ఈహెచ్‌ఎ్‌స స్కీమ్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్స్‌ ఉన్నారు. సింగరేణి ఉద్యోగులతో పాటు ఆర్టీసీ, జెన్‌కో, ట్రాన్స్‌కో ఉద్యోగులు దీని పరిధిలో లేరు. పోలీసులు ఆరోగ్య భద్రత స్కీమ్‌ కింద వైద్య సేవలు పొందుతున్నారు. అయితే.. తాజా హెల్త్‌ స్కీమ్‌లో పోలీసులను చేరుస్తున్నారు. ఆ తర్వాత దశలవారీగా సింగరేణి, ఆర్టీసీ, జెన్‌కో, ట్రాన్స్‌కో ఉద్యోగులను ఈ పథకం పరిధిలోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Updated Date - Feb 24 , 2026 | 05:24 AM