రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు
ABN , Publish Date - Feb 24 , 2026 | 05:48 AM
ఇంటర్ వార్షిక పరీక్షలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. బుధవారం నుంచి ప్రథమ, గురువారం నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని ఇంటర్ విద్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు...
ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి
హాజరుకానున్న 9.97 లక్షల మంది విద్యార్థులు
ఇంటర్ విద్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య
హైదరాబాద్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): ఇంటర్ వార్షిక పరీక్షలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. బుధవారం నుంచి ప్రథమ, గురువారం నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని ఇంటర్ విద్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో మొత్తం 1495పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఫస్టియర్లో 489126 మంది, సెకండియర్లో 507949 మంది కలిపి మొత్తం 997075 మంది పరీక్షలకు హాజరుకానున్నారని వెల్లడించారు. పరీక్ష కేంద్రానికి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తామని తెలిపారు. విద్యార్థుల రవాణాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుందని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు, గోడ గడియారాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షల సమయంలో ఒత్తిడి, ఆందోళన, మానసిక ఆవేదన లాంటి సమస్యలను అధిగమించేందుకు 14416, 80693 91416 నెంబర్లను అందుబాటులోకి తెచ్చామని, విద్యార్థులు ఈ నెంబర్లకు ఫోన్ చేసి కౌన్సెలింగ్ సేవలు పొందవచ్చని కృష్ణ ఆదిత్య తెలిపారు.
ఒక్కో గురుకులానికి రూ.50 కోట్లు
రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకులాల రూపు రేఖలు మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని టీజీఎ్సడబ్ల్యూఆర్ ఈఐఎస్ కార్యదర్శి ఎస్.కృష్ణ ఆదిత్య వెల్లడించారు. మౌలిక వసతులు కల్పించేందుకు ఒక్కో విద్యాసంస్థకు సుమారు రూ.50 కోట్లు కేటాయించే దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గురుకులాల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించడమే లక్ష్యంగా పరిపాలనాపరమైన మార్పులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.