102 మంది జీవిత ఖైదీలను వెంటనే విడుదల చేయాలి
ABN , Publish Date - Mar 24 , 2026 | 05:07 AM
అర్హులైన జీవిత ఖైదీల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాలని మానవ హక్కుల వేదిక (హెచ్ఆర్ఎఫ్) నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.
మానవ హక్కుల వేదిక విజ్ఞప్తి
హైదరాబాద్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): అర్హులైన జీవిత ఖైదీల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాలని మానవ హక్కుల వేదిక (హెచ్ఆర్ఎఫ్) నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఖైదీల విడుదలపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. నిబంధనల ప్రకారం నాలుగు నెలలకోసారి జీవిత ఖైదీల విడుదలపై సమీక్ష జరగాలి. ప్రస్తుతం ఈ ప్రక్రియ ఆలస్యమైందని హెచ్ఆర్ఎ్ఫ నాయకులు జీవన్ కుమార్, తిరుపతయ్య గుర్తు చేశారు. ఆమోదానికి సిద్ధంగా ఉన్న 102 మంది జీవిత ఖైదీల విడుదల ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని కోరారు. అలాగే ప్రస్తుతం సిద్ధం అవుతున్న తదుపరి జాబితాలోని అర్హులైన ఖైదీలను రాబోయే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.