వెట్టి నుంచి 500 మందికి విముక్తి
ABN , Publish Date - May 21 , 2026 | 04:12 AM
నెల్లూరు జిల్లావ్యాప్తంగా సుమారు 500 మంది కుటుంబ సభ్యులతో కలిసి దళారుల ద్వారా తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఇటుక బట్టీల పనులకు వెళ్లారు.అక్కడ వారిచేత వెట్టిచాకిరీ ...
స్థానికుల ఫిర్యాదుతో స్పందించిన తెలంగాణ హైకోర్టు
మూడు బస్సుల్లో తుమ్మలపెంటకు, అక్కడ నుంచి వారి స్వగ్రామాలకు
కావలి, మే 20(ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లావ్యాప్తంగా సుమారు 500 మంది కుటుంబ సభ్యులతో కలిసి దళారుల ద్వారా తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఇటుక బట్టీల పనులకు వెళ్లారు.అక్కడ వారిచేత వెట్టిచాకిరీ చేయిస్తుండటంతో స్థానికులు హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. హైకోర్టు స్పందించి, విచారించి వారిని వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించింది. వారిని స్వగ్రామాలకు పంపేందుకు ఏర్పాట్లు చేసింది. అక్కడ నుంచి తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో 350 మంది బుధవారం మధ్యాహ్నం నెల్లూరు జిల్లా కావలికి చేరుకున్నారు. వారికి జిల్లా ప్రధాన న్యాయాధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నెల్లూరు, కావలికి చెందిన 12 మంది న్యాయాధికారులు, వివిధశాఖల అధికారులు స్వాగతం పలికారు. వచ్చిన వారికి తుమ్మలపెంట రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో భోజన ఏర్పాట్లు చేశారు. జిల్లా ప్రధాన న్యాయాధికారి శ్రీనివాసరావు వారికి అవసరమైన దుస్తులు, నిత్యావసరాలు దాతల సాయంతో సమకూర్చారు. బాధితులను ఎవరు మోసంచేసి అక్కడకు పంపారనే కోణంలో విచారణ చేపట్టారు. సాయంత్రం వారిని వారి స్వగ్రామాలకు తరలించారు.