ప్రభుత్వ ఆర్థిక విధాన నిర్ణయాలపై న్యాయసమీక్షకు అవకాశం లేదు: హైకోర్టు
ABN , Publish Date - Aug 16 , 2026 | 06:57 AM
ప్రభుత్వ ఆర్థిక విధాన నిర్ణయాలు, నిధులు కేటాయించడంలో ప్రభుత్వ ప్రాధాన్యాల విషయంలో న్యాయసమీక్షకు అవకాశం లేదని హైకోర్టు డివిజన్ బెంచ్ పేర్కొంది.
హైదరాబాద్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆర్థిక విధాన నిర్ణయాలు, నిధులు కేటాయించడంలో ప్రభుత్వ ప్రాధాన్యాల విషయంలో న్యాయసమీక్షకు అవకాశం లేదని హైకోర్టు డివిజన్ బెంచ్ పేర్కొంది. కొవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం నిలిపేసిన 2019 యాసంగి, వానాకాలం రైతుబంధు డబ్బులు పిటిషనర్లకు విడుదల చేయాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసింది. కొవిడ్ ఇబ్బందుల వల్ల ప్రభుత్వం 2019 వానాకాలంలో పది ఎకరాల వరకు, యాసంగిలో ఆరు ఎకరాల వరకు ఉన్న రైతులకే రైతుబంధు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అయితే, తమకు రైతు బంధు అందకపోవడంపై ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కిష్టాపురానికి చెందిన తూము వెంకట నారాయణ తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు.. తగిన నిర్ణయం తీసుకోవాలని ఖమ్మం జిల్లా వ్యవసాయ అధికారికి ఆదేశాలు జారీ చేసింది. కానీ నిధులు ఇవ్వలేమని ప్రభుత్వం పేర్కొనగా.. పిటిషనర్లు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. ఎనిమిది వారాల్లోగా పిటిషనర్లకు 2019 రైతుబంధు నిధులు ఇచ్చేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాలపై వ్యవసాయశాఖ హైకోర్టు డివిజన్ బెంచ్లో అప్పీలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం 2019కి సంబంధించి నిలిపేసిన రైతుబంధు డబ్బు ఇవ్వాలా ? వద్దా ? అనేది ప్రభుత్వ నిర్ణయమని పేర్కొంటూ సింగిల్ జడ్జి తీర్పును కొట్టేసింది.