తెలుగులో వాదనలు వినం
ABN , Publish Date - Feb 12 , 2026 | 02:43 AM
రాజ్యాంగబద్ధ (కాన్స్టిట్యూషనల్) కోర్టులైన హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో అధికారిక భాష ఆంగ్లం కాబట్టి ఆంగ్లంలోనే వాదనలు వినిపించాలని హైకోర్టు డివిజన్ బెంచ్ పేర్కొంది.
జడ్జీలందరికీ అర్థం కాకపోవచ్చు
ఆంగ్లంలోనే వాదనలు వినిపించాలి: హైకోర్టు
లాయర్ను పెట్టుకునేందుకు పిటిషనర్కు గడువు
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగబద్ధ (కాన్స్టిట్యూషనల్) కోర్టులైన హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో అధికారిక భాష ఆంగ్లం కాబట్టి ఆంగ్లంలోనే వాదనలు వినిపించాలని హైకోర్టు డివిజన్ బెంచ్ పేర్కొంది. తెలుగులో వాదనలు వినిపిస్తే డివిజన్ బెంచ్లోని తెలుగేతర జడ్జిలకు అర్థం కాదు కాబట్టి అంగ్లంలో వాదనలు వినిపించడానికి లాయర్ను పెట్టుకోవాలని ధర్మాసనం సూచించింది. ఇందుకు పిటిషనర్కు నాలుగు వారాల గడువు ఇచ్చింది. ఎంఎ్సఆర్ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ శాఖలకు చెందిన 22 కాంట్రాక్టులు ఇచ్చారంటూ టీ రాంబాబు అనే వ్యక్తి 2020లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. తాజాగా బుధవారం ఆ పిటిషన్ చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. పిటిషనర్ వ్యక్తిగత హోదాలో తెలుగులో వాదనలు వినిపించారు. అధికారిక భాష అంగ్లం కాబట్టి తెలుగులో వాదనలు వినలేమని ధర్మాసనం తరఫున జస్టిస్ మొహియుద్దీన్ పేర్కొన్నారు. దాంతో న్యాయవాదిని పెట్టుకోవడానికి సమయం ఇవ్వాలని పిటిషనర్ కోరారు.