గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై సుప్రీంకోర్టుకే వెళ్లండి: హైకోర్టు
ABN , Publish Date - May 08 , 2026 | 06:40 AM
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా మహమ్మద్ అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాంలను నియమించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది.
హైదరాబాద్, మే 7 (ఆంధ్రజ్యోతి): గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా మహమ్మద్ అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాంలను నియమించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ పెండింగ్లో ఉన్నందున అక్కడికే వెళ్లాలని సూచించింది. గవర్నర్ కోటాలో అజారుద్దీన్, కోదండరాంలను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ జారీ చేసిన జీవో 71కు చట్టబద్ధత లేదంటూ షియా సివిల్ కౌన్సిల్ ఫర్ సోషల్ జస్టి్సకు చెందిన సయ్యద్ హైదర్ రజా నఖ్వీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. గవర్నర్ కోటాలో కళలు, సాహిత్యం, సైన్స్, సామాజిక సేవ వంటి రంగాల్లో విశేష కృషి చేసిన వారిని మాత్రమే ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా వీరి నియమాకాలున్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ నగేశ్ బీమపాక ధర్మాసనం స్పందిస్తూ.. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న ఏ వ్యవహారంపై జోక్యం చేసుకునే అధికారం తమకు లేదని, అక్కడికే వెళ్లాలని.. ఇందుకు పిటిషనర్కు స్వేచ్ఛనిస్తున్నామని పేర్కొంటూ విచారణను ముగించింది.