న్యాయవాదుల కోటాలో హైకోర్టు జడ్జిలుగా తెలంగాణ వారినే నియమించాలి
ABN , Publish Date - Jun 16 , 2026 | 05:05 AM
న్యాయవాదుల కోటాలో తెలంగాణ భూమి పుత్రులనే హైకోర్టు జడ్జిలుగా నియమించాలని.. ఆంధ్రాకు చెందిన వారిని నియమిస్తే ఒప్పుకోమని తెలంగాణ హైకోర్టు ..
జనరల్ బాడీ సమావేశంలో హైకోర్టు న్యాయవాదుల తీర్మానం
హైదరాబాద్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): న్యాయవాదుల కోటాలో తెలంగాణ భూమి పుత్రులనే హైకోర్టు జడ్జిలుగా నియమించాలని.. ఆంధ్రాకు చెందిన వారిని నియమిస్తే ఒప్పుకోమని తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ పేర్కొంది. న్యాయవాదుల కోటా నుంచి హైకోర్టు జడ్జిలుగా నియామకమయ్యే జాబితాలో ఆంధ్రాకు చెందిన వారి పేర్లు ఉండటంపై నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షుడు సురేందర్రెడ్డి నేతృత్వంలో సోమవారం సర్వసభ్య సమావేశం జరిగింది. పలువురు సీనియర్ న్యాయవాదులు ఈ సందర్భంగా ప్రసంగించారు. హైకోర్టు కొలీజియంలో తెలంగాణకు చెందిన సీనియర్ జడ్జి లేరని.. తెలంగాణకు చెందిన జడ్జి ఉంటే తెలంగాణ న్యాయవాదులకు నష్టం జరగదని పేర్కొన్నారు. హైకోర్టు కొలీజియంలో తెలంగాణ జడ్జిని తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు చెందిన న్యాయవాదులను మాత్రమే హైకోర్టు జడ్జిలుగా నియమించాలని పేర్కొన్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, కేంద్ర న్యాయశాఖ మంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రి, వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులకు విజ్ఞాపనపత్రాలను అందించాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు వీ రఘునాథ్, రచనారెడ్డి, చిక్కుడు ప్రభాకర్, కార్యదర్శులు శ్రవణ్కుమార్, నిరంజన్రెడ్డి పాల్గొన్నారు.