ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో..ఆరోగ్యశాఖ పనితీరు ప్రశంసనీయం:దామోదర
ABN , Publish Date - Jun 14 , 2026 | 04:58 AM
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, క్షేత్రస్థాయి ఆరోగ్య కార్యకర్త...
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, క్షేత్రస్థాయి ఆరోగ్య కార్యకర్తలు బాగా పనిచేశారని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు. ఆరోగ్యశాఖ చేపట్టిన కార్యక్రమాలు ప్రజల్లో విశేష స్పందన పొందాయని, ప్రభుత్వ లక్ష్యాల సాధనలో ఆరోగ్యశాఖ కీలక పాత్ర పోషించిందని శనివారం మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత రెండున్నర సంవత్సరాల్లో ఆరోగ్యశాఖలో భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య సుమారు 15 వేలకు చేరుకుందని వెల్లడించారు. 20కి పైగా ప్రధాన కార్యక్రమాలను నిర్వహించి ఆరోగ్యకర జీవనశైలి, వ్యాధుల నివారణ, మాతా-శిశు ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, ఫుడ్ సేఫ్టీ, హెచ్ఐవీ నియంత్రణ, క్యాన్సర్ వంటి అంశాలపై ప్రజల్లో విస్తృత చైతన్యం కల్పించామని తెలిపారు.