బోనస్ మరో రూ.514 కోట్లు
ABN , Publish Date - Feb 17 , 2026 | 06:16 AM
ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సన్నధాన్యం విక్రయించిన రైతులకు బోనస్ బకాయిలు రూ.514.36 కోట్లు విడుదల...
సన్నాలకు క్వింటాకు రూ.500 చొప్పున రైతుల ఖాతాల్లోకి..
మొత్తంగా 1939 కోట్లు జమ
వానాకాలం చెల్లింపులు పూర్తి
హైదరాబాద్, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సన్నధాన్యం విక్రయించిన రైతులకు బోనస్ బకాయిలు రూ.514.36 కోట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. సోమవారం రైతుల ఖాతాల్లో ఈమేరకు జమ చేసినట్లు చెప్పారు. 2025-26 వానాకాలం సీజన్లో సన్నధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయించిన 2.17 లక్షల మంది రైతులకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ చెల్లిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ఇప్పటివరకు సన్నాలు విక్రయించిన రైతులకు రూ.1,939.58 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)పై క్వింటాలుకు అదనంగా రూ.500 బోన్సను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేసిన స్టీఫెన్ రవీంద్ర.. పెండింగ్ బకాయిల చెల్లింపులతో రైతులకు ఉపశమనం లభించినట్లు తెలిపారు.