Share News

భూముల విలువ పెంచాలి

ABN , Publish Date - Jun 13 , 2026 | 07:13 AM

రాష్ట్రంలో ప్రభుత్వ అవసరాల కోసం భూసేకరణ (ల్యాండ్‌ పూలింగ్‌), భూములను ఆదాయ వనరులుగా మార్చడం (ల్యాండ్‌ మానిటైజేషన్‌) వంటి ప్రక్రియలను మరింత వేగవంతం చేయాలని ఆర్థిక వనరుల..

భూముల విలువ పెంచాలి

  • ల్యాండ్‌ మానిటైజేషన్‌ను వేగవంతం చేయండి

  • అధికారులకు ఆర్థిక వనరుల సమీకరణ క్యాబినెట్‌ సబ్‌ కమిటీ ఆదేశాలు

రాష్ట్రంలో ప్రభుత్వ అవసరాల కోసం భూసేకరణ (ల్యాండ్‌ పూలింగ్‌), భూములను ఆదాయ వనరులుగా మార్చడం (ల్యాండ్‌ మానిటైజేషన్‌) వంటి ప్రక్రియలను మరింత వేగవంతం చేయాలని ఆర్థిక వనరుల సేకరణ క్యాబినెట్‌ సబ్‌ కమిటీ ఆదేశించింది. కమిటీ చైర్మన్‌, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన క్యాబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశం శుక్రవారం సచివాలయంలో జరిగింది. కమిటీ సభ్యులైన మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతోపాటు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ... రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికి, ఆదాయ వనరుల పెంపునకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. జాతీయ స్థాయిలో కీలక నిర్ణయాలు తీసుకునే జీఎస్టీ ఫిట్‌మెంట్‌ కమిటీలో తెలంగాణకు ప్రాతినిధ్యం దక్కేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అసైన్డ్‌ భూములపై రెవెన్యూ శాఖతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, జిల్లాలవారీగా ప్రభుత్వ భూములను గుర్తించేందుకు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీ్‌పకూమార్‌ సుల్తానియాను ఆదేశించారు. గతంలో ఉప్పల్‌ భగాయత్‌ ప్రాజెక్ట్‌ విజయవంతం కాగా.. ప్రస్తుతం మరో మూడు కొత్త ప్రాజెక్టులు పరిశీలనలో ఉన్నాయని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌ వివరించారు. హైదరాబాద్‌ ఇండస్ట్రియల్‌ ల్యాండ్స్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌(హిల్ట్‌) పాలసీ కింద జారీ చేయాల్సిన నోటిఫికేషన్లకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పూర్తిగా సహకరించాలని మంత్రులు సూచించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లలో ఉత్తరప్రదేశ్‌, హరియాణాల తర్వాత తెలంగాణ మూడో స్థానంలో ఉందని వాణిజ్య పన్నుల కమిషనర్‌ రఘునందన్‌రావు వివరించారు.

Updated Date - Jun 13 , 2026 | 07:13 AM