Share News

నిరుద్యోగులకు శుభవార్త!

ABN , Publish Date - May 07 , 2026 | 05:30 AM

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తీపికబురు అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

నిరుద్యోగులకు శుభవార్త!

  • వయోపరిమితి పెంపుపై సర్కారు కసరత్తు

  • ఐదేళ్లా.. పదేళ్లా..? త్వరలో ప్రకటించే అవకాశం

హైదరాబాద్‌, మే 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తీపికబురు అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇచ్చే నోటిఫికేషన్లలో వయో పరిమితి పెంపుపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. భవిష్యత్తులో వచ్చే నోటిఫికేషన్లకు వయోపరిమితి పెంచాలని ఇప్పటికే శాసన సభ, శాసన మండలి విప్‌లు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఎమ్మెల్సీలు కోదండరామ్‌, అద్దంకి దయాకర్‌ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి పదేళ్ల పాటు సడలించాలని కోరారు. తెలంగాణ ఉద్యమం సమయంలో సుదీర్ఘకాలం నోటిఫికేషన్లు రాకపోవడం, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం భర్తీ ప్రక్రియను నిర్లక్ష్యం చేయడంతో లక్షలాది మంది అభ్యర్థులు నష్టపోయారని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ అంశంపై సానుకూలత వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2022లో అప్పటి ప్రభుత్వం, నిరుద్యోగులకు పదేళ్ల వయసు సడలింపునివ్వడంతో.. జనరల్‌ అభ్యర్థులకు 44 ఏళ్లు, రిజర్వ్‌డ్‌ కేటగిరీలకు 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్ల వరకు అవకాశం లభించింది. అయితే, ఈ గడువు ఈ ఏడాది ఫిబ్రవరితో ముగిసింది. ఈ నేపథ్యంలో ఉద్యోగార్థుల వయో పరిమితిని ఐదేళ్లు పెంచాలా.. లేదా పదేళ్లు పెంచాలా.. అన్న అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. జనరల్‌ అభ్యర్థులకు ఐదేళ్లు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు పదేళ్లు సడలింపు ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అన్ని వర్గాలకు సమానంగా పదేళ్లు పెంచితేనే న్యాయం జరుగుతుందని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. దీనిపై ప్రభుత్వం నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Updated Date - May 07 , 2026 | 05:30 AM