ఢిల్లీలో ఈజేహెచ్ఎస్ సేవలు
ABN , Publish Date - Feb 10 , 2026 | 04:53 AM
దేశ రాజధాని ఢిల్లీలో ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని (ఈజేహెచ్ఎస్) అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
అపోలో ఆస్పత్రితో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): దేశ రాజధాని ఢిల్లీలో ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని (ఈజేహెచ్ఎస్) అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో సోమవారం తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి (కోఆర్డినేషన్) గౌరవ్ ఉప్పల్ అధ్యక్షతన ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రి యాజమాన్యంతో కీలక సమావేశం జరిగింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్రస్ట్ కింద ఎంపానెల్మెంట్ (నమోదు) ప్రక్రియపై ఈ సమావేశంలో చర్చించారు. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులకు నగదు రహిత చికిత్స సౌకర్యాలు అందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ సీఎం రేవంత్, ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి జితేందర్రెడ్డిల సహకారంతో గత ఏడాది నుంచి ఢిల్లీలోని వివిధ ఆస్పత్రులతో ఒప్పందానికి సంబంధించిన చర్చలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న అన్ని మ్యాక్స్ గ్రూప్ ఆస్పత్రులు, బి.ఎల్.కె మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఎంపానెల్మెంట్ ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. వెబ్సైట్ ఇంటిగ్రేషన్, టెక్నికల్ ఫార్మాలిటీలు జరుగుతున్నాయని, 10 రోజుల్లో జర్నలిస్టులు, ఇతర లబ్ధిదారులు ఈ ఆసుపత్రుల్లో చికిత్స పొందవచ్చని తెలిపారు. సమావేశంలో అపోలో ఆస్పత్రి ప్రతినిధులు, రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్రస్ట్ ప్రతినిధి మహబూబ్పాషా, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ నోడల్ అధికారి సి.హెచ్. చక్రవర్తి పాల్గొన్నారు.