పరిశీలనలో లిఫ్ట్ల ముసాయిదా బిల్లు
ABN , Publish Date - Feb 19 , 2026 | 04:43 AM
లిఫ్ట్ల (ఎలివేటర్లు) భద్రతపై ముసాయిదా బిల్లు తమ పరిశీలనలో ఉందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. లిఫ్ట్ల ఏర్పాటులో నిబంధనలు పాటించకపోవడం వల్ల చోటుచేసుకున్న....
హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): లిఫ్ట్ల (ఎలివేటర్లు) భద్రతపై ముసాయిదా బిల్లు తమ పరిశీలనలో ఉందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. లిఫ్ట్ల ఏర్పాటులో నిబంధనలు పాటించకపోవడం వల్ల చోటుచేసుకున్న ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో లిఫ్ట్ల భద్రతకు చట్టాన్ని ఆమోదించేలా ఆదేశించాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై చీఫ్ జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ తరఫు న్యాయవాది వాదిస్తూ లిఫ్ట్ల బిల్లు ముసాయిదాను సమర్పించామని, అది ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. అది ఏ దశలో ఉందో వివరాలు తెలియజేయాలని హైకోర్టు ఆదేశించింది. సదరు బిల్లు చట్టరూపం దాల్చే వరకు పిటిషనర్ ప్రతిపాదించిన మార్గదర్శకాలను ప్రభుత్వ ఆదేశాల రూపంలో జారీ చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదాపడింది.