ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక సిద్ధం చేయండి
ABN , Publish Date - Jul 05 , 2026 | 05:37 AM
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొంటే, దానికి అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు.
కలెక్టర్లకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశాలు
హైదరాబాద్, జూలై 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొంటే, దానికి అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. వ్యవసాయం, వైద్య, ఆరోగ్యం, విద్య, తాగునీటి అంశాలపై శనివారం సచివాలయం నుంచి కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించారు. ఈ సందర్భంగా సంజయ్ జాజు మాట్లాడుతూ... పంటల మార్పిడిపై రైతులను ఎప్పటికప్పుడు చైతన్యపరచాలని, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందేలా చూడాలని చెప్పారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణమైన పంటలు వేసేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించాలని ఆదేశించారు. విద్యుత్తు అంతరాయాలు లేకుండా చూడాలన్నారు. పాఠశాలల్లోని మధ్యాహ్న భోజన వంటశాలలకు తగిన స్థలాలను గుర్తించాలని తెలిపారు.