ఉద్యోగుల వేతన సవరణ అమలు చేయండి
ABN , Publish Date - Feb 12 , 2026 | 12:57 AM
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలు వెంటనే చెల్లించాలని, సాధారణ బదిలీలు ఏప్రిల్, మే నెలల్లో పూర్తి చేయాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం...
సీఎంకు వినతి పత్రం ఇచ్చిన టీజీవోసీఏ
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ఆంధ్ర జ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలు వెంటనే చెల్లించాలని, సాధారణ బదిలీలు ఏప్రిల్, మే నెలల్లో పూర్తి చేయాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం(టీజీవోసీఏ)డిమాండ్ చేసింది. టీజీవో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివా్సరావు, ప్రధాన కార్యదర్శి బి.శ్యామ్ ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావుకు వినతి పత్రం అందజేశారు. రెండో వేతన సవరణ(పీఆర్సీ) విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించాలని టీజీవో డిమాండ్ చేసింది. 42శాతం ఫిట్మెంట్, 2024 జనవరి 1 నుంచి 2025 జూలై 1 వరకు బకాయి ఉన్న 4డీఏలు విడుదల చేయాలని కోరింది. పీఆర్సీ నివేదిక గడువు ముగిసి 22 నెలలు దాటిపోయిందని తెలిపారు. 2026-27 బడ్జెట్లో పీఆర్సీ అమలుకు నిధులు కేటాయించాలని ఉపముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. గత ఆరేళ్లుగా బదిలీల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగుల కోసం బదిలీల ప్రక్రియను ప్రారంభించాలని, ఏప్రిల్, మే నెలల్లో బదిలీలు పూర్తిచేయాలని కోరారు. గతంలో 40 శాతం పరిమితి విధించడం వల్ల చాలా మంది బదిలీలకు దూరమయ్యారని గుర్తు చేశారు. 6-13 ఏళ్ల పాటు ఒకే చోట పని చేస్తున్న ఉద్యోగులను తప్పకుండా బదిలీ చేయాలని కోరారు.