కొత్త పాఠ్య పుస్తకాలు రెడీ!
ABN , Publish Date - Jun 01 , 2026 | 05:10 AM
కొత్త పాఠ్య పుస్తకాలు హైదరాబాద్ రామంతాపూర్లోని గోదాముల నుంచి మండల విద్యా వనరుల కేంద్రాల(ఎమ్మార్సీ)కు చేరుకుంటున్నాయి.
గోదాముల నుంచి ఎమ్మార్సీలకు 65ు తరలింపు
నోట్ బుక్స్ 5.80 లక్షలకు 40 వేలు మాత్రమే వచ్చాయి!
హైదరాబాద్ సిటీ, మే 31(ఆంధ్రజ్యోతి): కొత్త పాఠ్య పుస్తకాలు హైదరాబాద్ రామంతాపూర్లోని గోదాముల నుంచి మండల విద్యా వనరుల కేంద్రాల(ఎమ్మార్సీ)కు చేరుకుంటున్నాయి. శనివారం రాత్రికి 65 శాతం పుస్తకాల తరలింపు పూర్తయింది. గతంలో పాఠశాలలు ప్రారంభమైన రెండు, మూడు నెలలకు కూడా పుస్తకాల పంపిణీ జరిగేది కాదు. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు జూన్ 12న పాఠశాలల పునఃప్రారంభం రోజే విద్యార్థులకు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలోని 16 మండలాల పరిధిలో 713 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. ఆ స్కూళ్లలో 2 నుంచి 10వ తరగతి వరకు ప్రస్తుతం సుమారు 85,503 మంది చదువుతున్నారు. కొత్తగా చేరేవారిని కూడా అంచనా వేసి.. ఈసారి 10,15,989 పాఠ్యపుస్తకాలు కావాలని ఏప్రిల్ మొదటి వారంలో విద్యాశాఖకు ఇండెంట్ పెట్టారు. ఇందులో ఇప్పటివరకు సుమారు 6.80 లక్షల పుస్తకాలు ఎమ్మార్సీలకు చేరినట్లు తెలిసింది. పాఠ్యపుస్తకాలతో పాటు నోట్ బుక్స్ కూడా ఉచితంగా ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇండెంట్ పెట్టిన 5.80 లక్షల నోట్ బుక్స్లో ఇప్పటి వరకు 40 వేలు మాత్రమే వచ్చినట్లు సమాచారం.