యథాతథంగా ఫీజు రీయింబర్స్మెంట్
ABN , Publish Date - May 27 , 2026 | 04:37 AM
ఫీజు రీయింబర్స్మెంట్ పథకం యథాతథంగా కొనసాగే విధంగా సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలు తీసుకుంటానని బీసీ సంక్షేమ....
కొనసాగించేందుకు చర్యలు : వీహెచ్
జీవో7ను తక్షణమే రద్దు చేయాలి: బండారు దత్తాత్రేయ
బర్కత్పుర, మే 26 (ఆంధ్రజ్యోతి) : ఫీజు రీయింబర్స్మెంట్ పథకం యథాతథంగా కొనసాగే విధంగా సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలు తీసుకుంటానని బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వమే బీసీ విద్యార్థుల పూర్తి ఫీజులు చెల్లించేలా చొరవ తీసుకుంటానని చెప్పారు. మంగళవారం కాచిగూడ అభినందన్ గ్రాండ్ హోటల్లో బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్గౌడ్, రాష్ట్ర అధ్యక్షుడు గొడుగు మహేష్ యాదవ్ల ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలంటూ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న వీహెచ్ మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ అమలుపై కేసీఆర్ ప్రభుత్వం ర్యాంకుల నిబంధన విధించిందని, సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడి ఈ నిబంధన తొలగింపజేస్తానని అన్నారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 7 అత్యంత ప్రమాదకరమైనదని ఆందోళన వ్యక్తం చేశారు. జీవో 7ను రద్దు చేసి నేరుగా కళాశాలల యాజమాన్యాలకే రీయింబర్స్మెంట్ అందించాలని ఆయన డిమాండ్ చేశారు.