ఈ నెలాఖరు వరకూ పత్తి కొనుగోళ్లు: తుమ్మల
ABN , Publish Date - Feb 22 , 2026 | 06:52 AM
రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు, పత్తి రైతులకు ఇబ్బంది కలగకుండా ఈ నెలాఖరు వరకు పత్తి కొనుగోళ్ల కొనసాగింపునకు సీసీఐ అంగీకరించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
హైదరాబాద్/ రాయదుర్గం, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు, పత్తి రైతులకు ఇబ్బంది కలగకుండా ఈ నెలాఖరు వరకు పత్తి కొనుగోళ్ల కొనసాగింపునకు సీసీఐ అంగీకరించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ సీజన్లో పత్తి సాగు, దిగుబడి ఆలస్యం కావటంతో క్రయ విక్రయాల్లో జాప్యం జరుగుతోందన్నారు. తొలుత ఈ నెల 20 నుంచి పత్తి సేకరణ నిలిపేస్తున్నట్లు సీసీఐ శుక్రవారం ప్రకటించింది. దీంతో ఈ నెలాఖరు వరకూ పత్తి సేకరణ పొడిగించాలని కేంద్ర మంత్రులు కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్కు లేఖలు రాసినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఈనెలాఖరు వరకు పత్తి కొనుగోళ్లకు గడువు పొడిగించినట్లు వెల్లడించారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్లోని ఫైర్ వాటర్ నియో కిచెన్ బ్యాంకెట్ హాల్లో సోషలైట్ అలేఖ్య రెడ్డి నిర్వహించిన ఎవ్వాహ్- వీవర్స్ హబ్ ఎగ్జిబిషన్లో మంత్రి తుమ్మల ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ.. భారత సంస్కృతిలో పట్టు, చేనేత వస్త్రాలకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. చేనేత కార్మికులకు సర్కారు అన్ని విధాల అండగా ఉంటుందన్నారు.