పోలవరం-నల్లమల సాగర్ లేకుండా చర్చ
ABN , Publish Date - Jan 25 , 2026 | 03:20 AM
తెలుగు రాష్ర్టాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ అధ్యక్షతన ఈ నెల 30న జరిగే సమావేశం కోసం తెలంగాణ తరఫున ప్రస్తావించే ఎజెండాపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
30న సమావేశానికి ఎజెండా సిద్ధం చేస్తున్న తెలంగాణ
హైదరాబాద్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ర్టాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ అధ్యక్షతన ఈ నెల 30న జరిగే సమావేశం కోసం తెలంగాణ తరఫున ప్రస్తావించే ఎజెండాపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ సమావేశంలో పోలవరం-బనకచర్ల/నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు డీపీఆర్ తయారీ ప్రక్రియతోపాటు ఆ ప్రాజెక్టు అక్రమ నిర్మాణానికి ఏపీ చేస్తున్న ప్రయత్నాలను, ప్రాజెక్ట్ ప్రాఽథమిక సాధ్యాసాధ్యాల నివేదిక మదింపునకు సీడబ్ల్యూసీ చేపట్టిన ప్రక్రియను విరమించుకోవాలని, సమావేశ ఎజెండాలో ఆ ప్రాజెక్టు తప్ప మిగతా అంశాలపై చర్చకు సిద్ధమనే సంకేతాలను ప్రభుత్వం ఇవ్వాలనుకుంటోంది. కృష్ణా జలాలను తాత్కాలికంగా పంపిణీ చేస్తూ రాష్ట్ర విభజన తర్వాత తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసి 50:50 నిష్పత్తితో నీటి పంపకాలు చేపట్టాలనే డిమాండ్ను కూడా కమిటీ ముందు తెలంగాణ ఉంచే అవకాశాలున్నాయి. ఏపీ అక్రమంగా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఎస్ఆర్ఎంసీ లైనింగ్ తదితర ప్రాజెక్టును అడ్డుకోవాలని కోరే అవకాశాలున్నాయి.