గురుకుల అడ్మిషన్లలో పైరవీలకు తావులేదు
ABN , Publish Date - Apr 08 , 2026 | 06:14 AM
రాష్ట్రంలోని దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు.
పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యే లక్ష్యం: అడ్లూరి
హైదరాబాద్, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. గురుకుల అడ్మిషన్ల ప్రక్రియలో పైరవీలకు తావులేకుండా అత్యంత పారదర్శకం గా అర్హులైన వారికే సీట్లు దక్కేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు. మంగళవారం సచివాలయంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన టీజీసెట్-2026 ఫేజ్-1 ఫలితాలను ఆయన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 22న నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 1,02,960 మంది విద్యార్థులు హాజరుకావడం గురుకుల విద్యపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని ఆయన అన్నారు. ఎంపికైన విద్యార్థులు ఈ నెల 20లోపు వారికి కేటాయించిన పాఠశాలల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు.