నేటి నుంచి ఆర్టిజన్ల సమ్మె!
ABN , Publish Date - Apr 08 , 2026 | 05:48 AM
తమ సమస్యలు, న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం తెలంగాణ విద్యుత్ ఆర్జిజన్ ఎంప్లాయీస్ జేఏసీ (టీవీఏఈజేఏసీ) కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ ప్రకటన
సమ్మె చేస్తే చర్యలు
విద్యుత్ సంస్థల తీవ్ర హెచ్చరిక
హైదరాబాద్ సిటీ, హైదరాబాద్, రాంనగర్, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): తమ సమస్యలు, న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం తెలంగాణ విద్యుత్ ఆర్జిజన్ ఎంప్లాయీస్ జేఏసీ (టీవీఏఈజేఏసీ) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న 19వేల మంది ఆర్టిజన్లు బుధవారం నుంచి నిరవధిక సమ్మెలోకి వెళుతున్నట్టు మంగళవారం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 19 వేల మంది ఆర్టిజన్లు, 1400 మంది ఆన్స్కిల్డ్ కార్మికులు బుధవారం ఉదయం 9 గంటల నుంచి సమ్మెలో పాల్గొంటారని జేఏసీ కన్వీనర్ సాయిలు, చంద్రారెడ్డి ప్రకటించారు. ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎ్సఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పీస్ రేట్ కార్మికులకు జీవో నం.11 ప్రకారం వేతనాలు కల్పించాలన్నారు. సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. విద్యుత్ సంస్థల్లో ఎస్మా చట్టం అమల్లో ఉం దని, దీన్ని ఉల్లంఘించి, ఎవరైనా సమ్మె చేపడితే వారిపై చట్టపరమైన, శాఖాపరమైనచర్యలు తీసుకుంటామని హెచ్చరించాయి. సంఘాల డిమాండ్లు పారిశ్రామిక ట్రైబ్యునల్ ముందు ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఇచ్చిన సమ్మె నోటీసు చెల్లుబాటు కాదని దక్షిణ డిస్కమ్(ఎస్పీడీసీఎల్) సీఎండీ జితేష్ వి.పాటిల్, ట్రాన్స్కో డైరెక్టర్ వి.శ్రీనివాసులు తెలిపారు.
హనుమకొండలో భారీ ధర్నా
టీవీఏఈజేఏసీ హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట మంగళవారం భారీ ఎత్తున ధర్నా చేసింది. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన ఆర్టిజన్లు, అన్మ్యాన్డ్, స్పాట్ బిల్డర్ కార్మికులు పాల్గొన్నారు.