ఈహెచ్ఎస్కు పెన్షనర్లు వివరాలు ఇవ్వక్కర్లేదు
ABN , Publish Date - May 30 , 2026 | 03:40 AM
ఉద్యోగుల ఆరోగ్య పథకాని(ఈహెచ్ఎస్)కి సంబంధించి రాష్ట్రంలోని పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లు తమ వివరాలను అందించాల్సిన అవసరం ...
హైదరాబాద్, మే 29 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల ఆరోగ్య పథకాని(ఈహెచ్ఎస్)కి సంబంధించి రాష్ట్రంలోని పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లు తమ వివరాలను అందించాల్సిన అవసరం లేదని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్ శుక్రవారం అంతర్గత ఉత్తర్వులను జారీ చేశారు. ఈహెచ్ఎస్ కోసం ఉద్యోగులు, పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లు తమ వివరాలను ‘ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టం(ఐఎఫ్ఎంఐఎస్-హెచ్ఆర్) పోర్టల్లో అప్లేడ్ చేయాలంటూ నాలుగు రోజుల కింద ఆర్థిక శాఖ సూచించింది. కానీ.. వివరాలను అప్లోడ్ చేయడంలో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇప్పటికే ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్న డేటాను వినియోగించుకోవాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డు ఉద్యోగుల సంఘం కోరింది. దీంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటాను వినియోగించుకోవాలని నిర్ణయించామని, కాకపోతే.. ఆ డేటాలో ఏవైనా తప్పొప్పులుంటే సవరించుకోవాలని ఆర్థిక శాఖ పెన్షనర్లకు సూచించింది.