ట్రూ-అప్ భారం ప్రజలపై వేయబోం
ABN , Publish Date - Feb 28 , 2026 | 04:22 AM
ట్రూ-అప్ భారం ప్రజలపై నేరుగా వేయబోమని, ఆ మేరకు ప్రభుత్వం నుంచి నిధులు ఇప్పించాలని డిస్కమ్లు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి...
ఆ మేరకు ప్రభుత్వం నుంచి నిధులిప్పించండి
టీజీఈఆర్సీకి డిస్కమ్ల విజ్ఞప్తి
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): ట్రూ-అప్ భారం ప్రజలపై నేరుగా వేయబోమని, ఆ మేరకు ప్రభుత్వం నుంచి నిధులు ఇప్పించాలని డిస్కమ్లు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి(టీజీఈఆర్సీ)ని విజ్ఙప్తి చేశాయి. శుక్రవారం ఈఆర్సీలో పవర్ పర్చేస్, రెవెన్యూ ట్రూ-అ్పపై ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్, సభ్యులు కంచర్ల రఘు, చెరుకూరి శ్రీనివాసరావులు బహిరంగ విచారణ నిర్వహించారు. దీనికి మూడో డిస్కమ్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఉత్తర డిస్కమ్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి, దక్షిణ డిస్కమ్ సీఎండీ జితేష్ వి.పాటిల్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా డిస్కమ్ల సీఎండీలు మా ట్లాడుతూ.. వార్షిక ఆడిట్ ఆధారంగా ఈఆర్సీ అనుమతించిన మేరకు ఆదాయం రానందువల్ల రెవెన్యూ ట్రూ-అప్, 24 గంటల పాటు విద్యుత్ సరఫరా, నిర్ణీత ఒప్పందం మేరకు విద్యుత్ ఉత్పత్తి లేకపోవడం వల్ల బహిరంగ విపణిలో కరెంట్ కొనుగోళ్లు చేశామని నివేదించాయి. దీనివల్ల 5 వేల మిలియన్ యూనిట్లకు పైగా స్వల్పకాలిక కొనుగోళ్లు చేశామని, ట్రూ-అప్ విజ్ఙప్తిని ఆమోదించాలని, ఈ భారాన్ని ప్రజల నుంచి వసూ లు చేయబోమని, ప్రభుత్వం నుంచే ఇప్పించేలా ఈఆర్సీ చొరవ తీసుకోవాలని నివేదించారు. 2022-23లో పవర్ పర్చేస్ ట్రూ-అప్ (ఆమోదించిన కరెంట్ కొనుగోళ్లకన్నా అయిన వాస్తవిక వ్యయం) రూ.6882 కోట్లు, 2023-24లో రెవెన్యూ ట్రూ-అ్ప(ఆమోదించిన దానికన్నా ఎక్కువ అయి న వ్యయం)కింద రూ.2449 కోట్లను ఆమోదించాలని, ఇక 2024-25లో ఈఆర్సీ అనుమతించినదానికన్నా రూ.799కోట్ల అధిక ఆదాయం వచ్చిందని, దీన్ని ట్రూ-డౌన్(వినియోగదారులకు తిరిగిచ్చేయడం)తీసివేయగా.. రూ.8532కోట్లు ప్రభుత్వంనుంచి ఇప్పించాలని ఈఆర్సీని కోరారు.