డీజీపీ నియామకంపై రెండు వారాల్లో నిర్ణయం
ABN , Publish Date - Apr 04 , 2026 | 04:51 AM
డీజీపీ నియామకం కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) పంపించిన పేర్లను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని అడ్వొకేట్ జనరల్ ఏ.సుదర్శన్రెడ్డి...
హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): డీజీపీ నియామకం కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) పంపించిన పేర్లను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని అడ్వొకేట్ జనరల్ ఏ.సుదర్శన్రెడ్డి హైకోర్టుకు తెలిపారు. తెలిపారు. రెండు వారాల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల కారణంగా పరిశీలన ప్రక్రియలో జాప్యమైందన్నారు. దీంతో న్యాయస్థానం తదుపరి విచారణ ఈ నెల 13కు వాయిదా వేసింది. తెలంగాణ డీజీపీగా శివధర్రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్కు చెందిన సామాజిక కార్యకర్త టి.ధన్గోపాల్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయనను నియమిస్తూ సెప్టెంబర్ 2025న జారీ అయిన ఉత్తర్వులు.. 2018లో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించడమేనని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ వాదనలు వినిపిస్తూ డీజీపీ పదవిని తాత్కాలిక ప్రాతిపదికన నియమించడం సాధ్యం కాదని, ఈ విషయంలో ప్రభుత్వం చూపుతున్న సాకులన్నీ నిరాధారమైనవని పేర్కొన్నారు. దీనికి ఏజీ అభ్యంతరం తెలుపుతూ.. శాశ్వత డీజీపీ నియామక అంశంపై రెండు వారాల్లో సర్కార్ నిర్ణయం తీసుకుంటుందని, అప్పటివరకు సమయం ఇవ్వాలని కోరారు.