దేవాదాయ శాఖలో కొత్తగా 190 ఈవో పోస్టులు
ABN , Publish Date - May 03 , 2026 | 04:25 AM
దేవాదాయ శాఖలో 190 కార్యనిర్వహణ అధికారి(ఈవో) పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా జీవో ...
మంత్రి కొండా సురేఖకు అర్చక, ఉద్యోగుల జేఏసీ కృతజ్ఞతలు
హైదరాబాద్, మే 2(ఆంధ్రజ్యోతి): దేవాదాయ శాఖలో 190 కార్యనిర్వహణ అధికారి(ఈవో) పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా జీవో ఎంఎస్ నెంబరు 42 జారీ చేసారు. దేవాదాయ శాఖలో సిబ్బంది కొరత అధిగమించడంతోపాటు ఆలయాల నిర్వహణ సజావుగా జరిగేందుకు కొత్తగా గ్రేడ్-1, గ్రేడ్-2, గ్రేడ్-3 ఈవో స్థాయిలో 190 పోస్టులు కొత్తగా ఏర్పడ్డాయి. అందులో జోనల్ స్థాయిలో గ్రేడ్-1లో 41, గ్రేడ్-2లో 62 పోస్టులు కాగా జిల్లా స్థాయిలో గ్రేడ్-3 ఈవో పోస్టులు 87 ఉన్నాయి. పోస్టుల భర్తీకి సంబంధించి పదోన్నతులతోపాటు సర్వీస్ రూల్స్ ప్రకారం నేరుగా నియమకాలు చేపట్టాల్సిన అవసరం ఉన్న చోట ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలని దేవాదాయ శాఖ అధికారుల్ని ప్రభుత్వం ఆదేశించింది. కాగా కొత్త పోస్టులపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు అర్చక, ఉద్యోగుల జేఏసీ కృతజ్ఞతలు తెలిపింది. జేఏసీ కన్వీనర్ డీవీఆర్ శర్మ, తదితరులు మంత్రిని ఆమె నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అర్చక, ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని జేఏసీ నాయకులకు మంత్రి భరోసా ఇచ్చారు. మరోవైపు దేవాదాయ శాఖలో సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న సీనియార్టీ ఫైనలైజేషన్, పదోన్నతుల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.