‘ప్రాణహిత’కు జాతీయ హోదా ఇవ్వాలి
ABN , Publish Date - May 06 , 2026 | 07:17 AM
రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ.. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరారు.
రాష్ట్రానికి వస్తున్న ప్రధాని ప్రకటన చేయాలి
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క
సిరిసిల్ల, మే 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ.. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణలోని ఒక ప్రధాన సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాల్సి ఉందని, కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్కు భట్టి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకుండా తప్పించుకోవడం రైతులను మోసం చేయడమేనని విమర్శించారు. బయోగ్యాస్ ద్వారా రైతులకు ఆదాయం చేకూరుతుందని, పర్యావరణానికి మేలు జరుగుతుందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఉపయోగకరమైన పనులు చేపడుతున్నారని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మొసలికన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ప్రత్యామ్నాయ ఇంధనానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. రాజ్యసభ సభ్యుడు నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బయో గ్యాస్ ప్లాంట్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం పాల్గొన్నారు.