నీట్ నిర్వహణలో అవాంతరాలు తలెత్తవద్దు: సీఎస్
ABN , Publish Date - Jun 07 , 2026 | 06:23 AM
ఈ నెల 21న జరగనున్న నీట్-యూజీ పరీక్ష(ఇటీవల ప్రశ్నపత్రం లీక్ అయిన నేపథ్యంలో మళ్లీ నిర్వహిస్తున్నారు) కోసం రాష్ట్రంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాల...
హైదరాబాద్, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 21న జరగనున్న నీట్-యూజీ పరీక్ష(ఇటీవల ప్రశ్నపత్రం లీక్ అయిన నేపథ్యంలో మళ్లీ నిర్వహిస్తున్నారు) కోసం రాష్ట్రంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నీట్ పరీక్ష ఏర్పాట్లు, వరి ధాన్యం కొనుగోలు, జూన్ 9న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండులో జరిగే సీఎం రేవంత్ సభ తదితర అంశాలపై మాట్లాడారు. నీట్ పరీక్ష కోసం రాష్ట్రంలోని 24 పట్టణాల్లో 208 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారని, రాష్ట్రం నుంచి 72,956 మంది విద్యార్థులు హాజరవుతున్నారని సీఎస్ వివరించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా పరీక్ష నిర్వహణ పూర్తి కావాలన్నారు. మరోవైపు, ధాన్యం నిల్వ ఉన్న ప్రాంతాల్లో కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు.