నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
ABN , Publish Date - Jun 18 , 2026 | 05:33 AM
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గురువారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రధానంగా మెట్రో రెండో దశ నిర్మాణం, మొదటి దశ టేకోవర్ అంశాలపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు.
మెట్రో మొదటి దశ టేకోవర్, ఇతర అంశాలపై చర్చ
రాష్ట్రంలో వీబీజీ రామ్జీ అమలుపైనా చర్చించే అవకాశం
హైదరాబాద్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గురువారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రధానంగా మెట్రో రెండో దశ నిర్మాణం, మొదటి దశ టేకోవర్ అంశాలపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు. వానాకాలం సీజన్, ఖరీఫ్ సాగు అంశాలతో పాటు సాగునీటి ప్రాజెక్టుల గురించి చర్చించనున్నారు. ప్రధానంగా మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు అనుమతి తీసుకువచ్చే విషయం మంత్రివర్గ భేటీలో కీలకాంశంగా ఉంది. వీటితో పాటు కొత్త చట్టం ప్రకారం వీబీజీ రామ్జీ పఽథకాన్ని రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా నిర్వహించాల్సిన తీరుపైనా ఈ భేటీలో చర్చించనున్నారు. ప్రస్తుత పనులు పూర్తయ్యే వరకు వందశాతం నిధులు కేంద్రమే భరించాలని, కొత్త పథకం అమలును కనీసం రెండు నెలలు వాయిదా వేయాలని కేంద్రాన్ని కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ సీజన్లో తప్పనిసరిగా 60 రోజులపాటు పనులు నిలిపివేయాలనే నిబంధన గ్రామీణ పేద కుటుంబాల జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని, దీనిపై కూడా చర్చించి.. కేంద్రానికి ప్రతిపాదన చేయనున్నట్లు తెలిసింది. వీటితో పాటు మరికొన్ని కీలకాంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వవర్గాలు పేర్కొన్నాయి.