తెలంగాణపై బీజేపీది దొంగ ప్రేమ
ABN , Publish Date - Jun 09 , 2026 | 05:14 AM
తెలంగాణపై బీజేపీది దొంగ ప్రేమ అని మరొకసారి బట్టబయలైందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీ్సను అసలు సీఎం...
ఫడ్నవీస్కు లేఖలపై రాంచందర్రావు అనాలోచితంగా మాట్లాడటం దారుణం: మహేశ్ గౌడ్
హైదరాబాద్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణపై బీజేపీది దొంగ ప్రేమ అని మరొకసారి బట్టబయలైందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీ్సను అసలు సీఎం రేవంత్ రెడ్డి సమయం కోరారా? అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండిపడ్డారు. ఇంతటి కీలక విషయంపై అనాలోచితంగా అవగాహనలేమితో ఆయన వ్యాఖ్యలు చేయడం చాలా దారుణమన్నారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ఫడ్నవీస్కు లేఖలు రాసిన విషయం తెలియకపోవడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని.. కావాలంటే ఆ లేఖలను పంపుతానని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రగతి పట్ల, రైతులకు అవసరమైన ప్రాజెక్టుల పట్ల బీజేపీ చిత్తశుద్ధి ఏపాటిటో స్పష్టమైందని చెప్పారు. రాష్ట్ర ప్రజలు, రైతుల ప్రయోజనాలపై ఇంతటి నిర్లక్ష్యం, విద్వేషం బీజేపీ వాళ్లకెందుకని ప్రశ్నించారు. రేవంత్రెడ్డి లేఖ రాసినా బీజేపీ నేతలు పచ్చి అబద్ధాలు చెప్పినందుకు, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు అడ్డుపడి తెలంగాణ ప్రయోజనాలు కాలరాస్తున్నందుకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తుమ్మిడిహెట్టి, ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ నేతలు చర్చకు రావాలన్నారు.