తెలంగాణ సైనిక్ వెల్ఫేర్ బోర్డు డైరక్టర్ నియామక ప్రక్రియ ప్రారంభం
ABN , Publish Date - Feb 12 , 2026 | 12:49 AM
తెలంగాణ సైనిక్ వెల్ఫేర్ బోర్డు డైరక్టర్ నియామక ప్రక్రియను 18 ఏళ్ల తర్వాత హోం శాఖ చేపట్టింది. దాదాపు 18 ఏళ్లుగా 30 వేల మందికి పైగా మాజీ సైనికుల సంక్షేమం చూడాల్సిన సైనిక్ వెల్ఫేర్బోర్డుకు డైరక్టర్ లేకుండా పోయారు...
18 ఏళ్లుగా ఖాళీగా ఉన్న పోస్టు
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ సైనిక్ వెల్ఫేర్ బోర్డు డైరక్టర్ నియామక ప్రక్రియను 18 ఏళ్ల తర్వాత హోం శాఖ చేపట్టింది. దాదాపు 18 ఏళ్లుగా 30 వేల మందికి పైగా మాజీ సైనికుల సంక్షేమం చూడాల్సిన సైనిక్ వెల్ఫేర్బోర్డుకు డైరక్టర్ లేకుండా పోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2008 తర్వాత సైనిక్ వెల్ఫేర్ బోర్డు డైరక్టర్ నియామకం జరగలేదు. ఈ విషయాన్ని గమనించిన తెలంగాణ హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్ కేంద్ర సైనిక్ వెల్ఫేర్ బోర్డు అధికారులను సంప్రదించి డైరక్టర్ నియామక ప్రక్రియ అవసరాన్ని గుర్తుచేశారు. ఈ క్రమంలో డైరక్టర్ పోస్టుకు మూడు నెలల క్రితం నోటిఫికేషన్ జారీ అయ్యింది. మంగళవారం సచివాలయంలో ఇంటర్వ్యూలను నిర్వహించారు. హోం, ఫైనాన్స్, జీఏడీ కార్యదర్శులతో పాటు కేంద్రీయ సైనిక్ వెల్ఫేర్ బోర్డు నుంచి వచ్చిన రక్షణ శాఖ అధికారులు సీవీ ఆనంద్తో కలిసి 29 మందిని ఇంటర్వ్యూ చేశారు. వీరిలో 8 మంది బ్రిగేడియర్ హోదాలో, 21 మంది కల్నల్ హోదాలో రిటైరైన వారున్నారు. ఆర్మీ, నావీ, ఎయిర్ఫోర్స్కు చెందిన పదవీ విరమణ చేసిన వేలాది మంది సంక్షేమం, సేవా అంశాలు, ఇతర సమస్యలను సైనిక్ వెల్ఫేర్ బోర్డు డైరక్టర్ పరిష్కరిస్తారు.