పారాక్వాట్ గడ్డి మందును నిషేధించాలి
ABN , Publish Date - Mar 31 , 2026 | 05:39 AM
రాష్ట్రంలో పారాక్వాట్ గడ్డిమందును నిషేధించాలని, ఇరాన్- అమెరికా యుద్దం ఆపేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతూ అసెంబ్లీలో సోమవారం వేర్వేరు తీర్మానాలను ప్రవేశపెట్టి, ఆమోదించింది.
అమెరికా-ఇరాన్ యుద్ధం ఆపేందుకు కేంద్రం యత్నించాలి.. తీర్మానాలకు సర్కార్ ఆమోదం
10 బిల్లులు పాస్.. సభ నిరవధిక వాయిదా
హైదరాబాద్, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పారాక్వాట్ గడ్డిమందును నిషేధించాలని, ఇరాన్- అమెరికా యుద్దం ఆపేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతూ అసెంబ్లీలో సోమవారం వేర్వేరు తీర్మానాలను ప్రవేశపెట్టి, ఆమోదించింది. పారాక్వాట్ డైక్లోరైడ్ నిషేధంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీర్మానం ప్రవేశపెట్టారు. వ్యవసాయ రంగంలో వాడుతున్న పారాక్వాట్ గడ్డిమందు తీవ్ర ముప్పుగా మారిందని, దీన్ని వాడుతున్న క్రమంలో రైతులు అనారోగ్యం పాలవుతున్నారని వెల్లడించారు. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం పారాక్వాట్ డైక్లోరైడ్ తయారీ, నిల్వ, రవాణా, వినియోగాన్ని తక్షణమే నిషేధించాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధాన్ని ఆపేందుకు కేంద్రం చొరవ తీసుకోవాలని కోరుతూ డిప్యూటీ సీఎం భట్టి తీర్మానాన్ని ప్రవేశపెట్టి, ఆమోదించారు. తీర్మానం చేసే ముందు తమ అభిప్రాయం ఎందుకు తీసుకోలేదంటూ బీజేపీ నేత శంకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, బడ్జెట్ సమావేశాలు సోమవారంతో ముగిశాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం 11 బిల్లులను సభలో ప్రవేశపెట్టింది. వాటిలో పదింటికి ఆమోదం తెలపగా, ఒక బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపినట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు. శాసనసభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.