డీఎంఈలో పీజీ వైద్యుల విలీనానికి అనుమతి
ABN , Publish Date - Apr 08 , 2026 | 05:29 AM
వైద్య ఆరోగ్యశాఖలో ప్రజారోగ్య సంచాలకులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ)ల పరిధిలో పనిచేస్తున్న పీజీ వైద్యులను వైద్యవిద్య సంచాలకుల (డీఎంఈ) పరిధిలోకి...
హైదరాబాద్, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్యశాఖలో ప్రజారోగ్య సంచాలకులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ)ల పరిధిలో పనిచేస్తున్న పీజీ వైద్యులను వైద్యవిద్య సంచాలకుల (డీఎంఈ) పరిధిలోకి విలీనం చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈమేరకు మంగళవారం హెల్త్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జడ్ చోంగ్తు సర్క్యులర్ జారీ చేశారు. వివిధ స్పెషాలిటీల్లో పీజీ పూర్తి చేసిన వైద్యులు స్వచ్ఛందంగా డీఎంఈ పరిధిలోకి వచ్చేందుకు సర్కారు అనుమతినిచ్చింది. డీఎంఈలో 40 శాతం అధ్యాపకులను ఇలా విలీనం ద్వారా భర్తీ చేస్తారు. మరో 60 శాతం నేరుగా నియమిస్తారు.మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై వైద్య సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇన్ సర్వీస్ పూర్తి చేసిన వైద్యులను అసిస్టెంట్ ప్రొఫెసర్ పదవుల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వైద్య చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్(టీపీహెచ్డీఏ) పేర్కొంది. ఈ మేరకు వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కత్తి జనార్దన్ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.