మొదలు కాలి.. కారుపై పడ్డ చెట్టు కొమ్మలు
ABN , Publish Date - May 29 , 2026 | 03:36 AM
పొలాల్లో పంట వ్యర్థాలకు అంటించిన మంటలు వ్యాపించి.. రహదారికి ఆనుకుని ఉన్న ఓ భారీ చెట్టు మొదలుకు అంటుకున్నాయి.
బోల్తా పడిన కారు.. టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి కుటుంబ సభ్యులకు గాయాలు
పంట వ్యర్థాల కాల్చివేతే ప్రమాదానికి కారణం
వైరా, మే 28(ఆంధ్రజ్యోతి): పొలాల్లో పంట వ్యర్థాలకు అంటించిన మంటలు వ్యాపించి.. రహదారికి ఆనుకుని ఉన్న ఓ భారీ చెట్టు మొదలుకు అంటుకున్నాయి. క్రమంగా మొదలు కాలగా ఒక్కసారి కొమ్మలు చీలిపోయి రోడ్డుపై వెళుతున్న ఓ కారుపై విరిగిపడ్డాయి. దాంతో కారు ఓ పక్కకు పల్టీ కొట్టింది. ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరం సమీపంలో వైరా-మధిర, జగ్గయ్యపేట ఆర్ అండ్ బీ రోడ్డుపై జరిగిన ఈ ప్రమాదంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ (టీజీవో) అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు భార్య పద్మ, ఆయన తల్లిదండ్రులు జోగయ్య, అనసూయతో పాటు వారి కారు డ్రైవర్ శంకర్కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ కారుకు ముందే శ్రీనివాసరావు మరో కారులో వెళ్లారు. ఆయన వెనక్కి వచ్చి ఇంకో కారులో తన భార్య, తల్లిదండ్రులను బ్రాహ్మణపల్లి పంపించారు. ఈ ప్రమాదంలో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది.