448 ఎకరాల ప్రభుత్వ భూమికి ఎసరు
ABN , Publish Date - Jul 09 , 2026 | 06:06 AM
రాష్ట్రంలో ప్రభుత్వ భూములను అధికారులు ప్రైవేటు వ్యక్తులకు పట్టా చేసిన కుంభకోణాలు ఇంకా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలంలో ..
కుకునూరుపల్లి తహసీల్దార్ సుజాత సస్పెన్షన్
అసైన్డ్, ప్రభుత్వ భూములను పట్టా చేసినట్లు గుర్తింపు
ఈ వ్యవహారంపై ఇప్పటికే సిట్ విచారణకు ప్రభుత్వం ఆదేశం
గజ్వేల్, జూలై 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రభుత్వ భూములను అధికారులు ప్రైవేటు వ్యక్తులకు పట్టా చేసిన కుంభకోణాలు ఇంకా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలంలో రెవెన్యూ అధికారులు ఏకంగా 448 ఎకరాల ప్రభుత్వ భూమికి ఇలా ఎసరు పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సిట్ విచారణలో భాగంగా ఈ విషయం వెల్లడైంది. మండలంలోని పలు గ్రామాల్లో అసైన్డ్, ప్రభుత్వ భూములను పట్టా చేసినట్లు తేల్చారు. తహసీల్దార్ దండు సుజాత కనీసం క్రాస్చెక్ చేసుకోకుండా, ఎలాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్లు లేకుండా పట్టామార్పిడి చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు తహసీల్దార్ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కె.హైమావతి ఉత్తర్వులు జారీ చేశారు. అసైన్డ్ భూములకు సంబంధించి దాదాపు 50 ఫైళ్ల మ్యుటేషన్ను ఆమోదించడంతోపాటు 10 వారసత్వ మార్పిడి ఫైళ్లను తహసీల్దార్ సుజాత క్లియర్ చేసినట్లుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఇప్పటికే శాఖాపరమైన విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఆరోపణలు రుజువైతే మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. పూర్తి విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి. కాగా, తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు హెడ్క్వార్టర్ వదిలి వెళ్లవద్దని తహసీల్దార్ సుజాతను కలెక్టర్ ఆదేశించారు.