టీడీపీ వస్తే గడీలు కదులుతాయని భయమా?
ABN , Publish Date - Jun 04 , 2026 | 06:06 AM
ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన ఎంఐఎం, సీపీఎం వంటి పార్టీలకూ ఇక్కడ మనుగడ ఉంది. వీరెవరి గురించి మాట్లాడని వ్యక్తులు టీడీపీ గురించో....
నన్నూరి నర్సిరెడ్డి
హైదరాబాద్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): ‘ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన ఎంఐఎం, సీపీఎం వంటి పార్టీలకూ ఇక్కడ మనుగడ ఉంది. వీరెవరి గురించి మాట్లాడని వ్యక్తులు టీడీపీ గురించో, పవన్ కల్యాణ్ గురించో ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే ఈ పార్టీలంటే భయమా? టీడీపీ మళ్లీ ఈ ప్రాంతంలో వస్తే గడీలు కదులుతాయని భయంగా ఉందా?’ అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, టీటీడీ పాలక మండలి సభ్యుడు నన్నూరి నర్సిరెడ్డి ప్రశ్నించారు. టీఆర్ఎస్ చీఫ్ కవితను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘ఈ మధ్యనే ఒకామె పార్టీ పెట్టింది. ఆమె ప్రపంచవ్యాప్తంగా లిక్కరు బిజినెస్ చేయవచ్చు. కానీ టీడీపీ ఈ గడ్డపై ఉండొద్దు అని చెప్పే హక్కు ఆమెకు ఎక్కడిది?’ అని నిలదీశారు. తెలంగాణలో ఏ గ్రామానికి వెళ్లినా టీడీపీ చేసిన అభివృద్ధి కళ్లకు కనిపిస్తుంది.. చెవులకు వినిపిస్తుందని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీలను మనుగడలో ఉంచాలా.. వద్దా? అనేది ప్రజలు నిర్ణయించాలి తప్ప ఎవరో పట్టుమని పది మంది కాదన్నారు. టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. జాతీయ పార్టీలు దేశం సమైక్యంగా ఉండాలని భావిస్తాయని.. కానీ ఓ జాతీయ పార్టీ మాత్రం ప్రాంతీయ తత్వాన్ని తీసుకురావడం బాధాకరమని వ్యాఖ్యానించారు.