kumaram bheem asifabad- వన్యప్రాణులకు అండ
ABN , Publish Date - Aug 28 , 2026 | 10:56 PM
అడవికి అందాలు వన్యప్రాణులే. వాటిని సంరక్షించే బాధ్యత అందరిపై ఉంది. అడవిలో నీరు, ఆహారం దొరకక వన్యప్రాణులు జనావాసాల్లోకి రావడం, మృత్యువాత పడడం జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో వన్యప్రాణుల రక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వరం్యలో అటవీశాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. వన్యప్రాణుల దాహం తీర్చడంతో పాటు వాటికి ఆహారం అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
చింతలమానేపల్లి, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): అడవికి అందాలు వన్యప్రాణులే. వాటిని సంరక్షించే బాధ్యత అందరిపై ఉంది. అడవిలో నీరు, ఆహారం దొరకక వన్యప్రాణులు జనావాసాల్లోకి రావడం, మృత్యువాత పడడం జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో వన్యప్రాణుల రక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వరం్యలో అటవీశాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. వన్యప్రాణుల దాహం తీర్చడంతో పాటు వాటికి ఆహారం అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. మండల పరిధిలోని కర్జెల్లి అటవీ రేంజ్, బాలాజీ అనుకోడ సెక్షన్లోని కోర్సిని బీట్, కర్జెల్లి సెక్షన్ పరిధిలో కర్జెల్లి బీట్ పరిధిలో వన్యప్రాణుల సంరక్షణ కోసం అటవీశాఖ అధికారులు చేపట్టిన చర్యలు అద్బుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. అటవీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గడ్డి భూముల పెంపకం బాలాజీఅనుకోడ సెక్షన్, కర్జెల్లి బీట్ పరిధిలోని విస్తారమైన అటవీ ప్రాంతంలో శాఖాహార వన్యప్రాణుల మేత కోసం అటవీ అధికారులు ప్రత్యేకంగా గడ్డి జాతులను పెంపొందించారు. అడవిలోని జంతువులు దాహార్తిని తీర్చేందుకు అనువైన ప్రాంతాల్లో ప్రత్యేక నీటి కుంటలను ఏర్పాటు చేశారు. అధికారులు పెంచిన పచ్చని గడ్డి మైదానాల్లో మూగ జీవాలు స్వేచ్ఛగా మేత మేస్తూ, ఏర్పాటు చేసిన నీటి కుంటల్లో నీరు తాగుతూ హాయిగా సమయాన్ని గడుపుతున్నాయి. అటవీ శాఖ అధికారుల నిరంతర కృషి, సరైన ప్రణాళికల వల్ల వన్యప్రాణులకు ఆహారంతో పాటు నీటి కొరత తీరింది, దీంతో అడవిలనే అనుకూల వాతావరణం ఏర్పడింది. దీని వల్ల జంతువులు జనవాసాల్లోకి రాకుండా అటవీ ప్రాంతంలోనే సురక్షితంగా జీవిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.