Minister Uttam Kumar Reddy: నల్లమలసాగర్పై సూట్ దాఖలు చేస్తాం
ABN , Publish Date - Jan 06 , 2026 | 02:31 AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పోలవరం - నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు నిర్మాణంపై స్టే ఇవ్వాలంటూ 12న రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీం కోర్టులో సూట్ దాఖలు చేయనున్నట్లు మంత్రి...
12న సుప్రీం కోర్టులో విచారణకు నేనే హాజరవుతా:ఉత్తమ్
హైదరాబాద్, జనవరి 5(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పోలవరం - నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు నిర్మాణంపై స్టే ఇవ్వాలంటూ 12న రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీం కోర్టులో సూట్ దాఖలు చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దాఖలు చేసిన రిట్ పిటిషన్ను సూట్ పిటిషన్గా మార్చి సమర్పించాలని సూచించిన కోర్టు.. కేసును 12వ తేదీకి వాయిదా వేసిందని గుర్తు చేశారు. 12న జరిగే విచారణకు స్వయంగా తానే హాజరవుతానని చెప్పారు. రానున్న రెండు రోజుల్లో న్యాయవాదులతో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని రూపొందిస్తామన్నారు. సోమవారం మీడియాతో ఆయన చిట్చాట్గా మాట్లాడారు. పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు నిర్మాణాన్ని తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక సైతం వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి హరీశ్రావు చూపిస్తున్నది అంతర్గత సమాచారం కోసం సీడబ్ల్యూసీ పంపిన లేఖ అని, ఇది ప్రాజెక్టును ఆమోదించినట్లు కాదని అన్నారు. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకే బీఆర్ఎస్ నేతలు అర్థరహితమైన ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కాగా, తుమ్మిడి హెట్టి ప్రాజెక్టు డీపీఆర్ తయారీ కోసం రూ.10కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో అవసరమైన చోట్ల కొత్త రేషన్షాపులు మంజూరు చేస్తామని ఉత్తమ్ ప్రకటించారు.