kumaram bheem asifabad- ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ చర్యలు
ABN , Publish Date - Feb 10 , 2026 | 10:32 PM
మున్సిపల్ ఎన్నికలలో భాగంగా బుధవారం పోలింగ్ నేపథ్యంలో సమర్థవంతమైన ప్రక్రియ నిర్వహణకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా ఆసిఫాబాద్, కాగజ్నగర్ మున్సిపాలిటీలలో వార్డుల పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లను పరిశీలించారు.
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికలలో భాగంగా బుధవారం పోలింగ్ నేపథ్యంలో సమర్థవంతమైన ప్రక్రియ నిర్వహణకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా ఆసిఫాబాద్, కాగజ్నగర్ మున్సిపాలిటీలలో వార్డుల పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు, పోలింగ్ సిబ్బంది ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి విధులు నిర్వహించాలని తెలిపారు. పోలింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించనున్నామని చెప్పారు. జిల్లాలోని మున్సిపాలిటీలో పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. కలెక్టర్ వెంట ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ గౌతమ్రాజు తదితరులు ఉన్నారు.
ఆసిఫాబాద్రూరల్, (ఆంధ్రజ్యోతి): రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం పోలింగ్ ప్రక్రియలో మున్సిపల్ పరిధిలో ఓటు హక్కు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరిత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత గల ఉద్యోగులు పోలింగ్ రోజుల ప్రత్యేక సాధారణ సెలవు సద్వినియోగం చేసుకుని ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.